CM Revanthreddy: తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరాన్ని మరింత ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన 12వ వార్షిక ఫోరమ్ సదస్సుకు హాజరయ్యారు.
విజన్ తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా హైదరాబాద్కు ఘన చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. హైదరాబాద్లో 70 కిలో మీటర్ల మెట్రో ఉందన్నారు. ఇప్పుడు 150 కిలో మీటర్లకు విస్తారించాలన్నది తమ లక్ష్యమన్నారు.
రోజుకు 15 లక్షల మంది ప్రయాణం చేసేలా మెట్రోను విస్తరిస్తామని మనసులోని మాట బయటపెట్టారు. మెట్రో ఫేజ్-2 ద్వారా పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టు విస్తరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నగర శివార్లలో నెట్ జీరో సిటీ అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణకు చేస్తున్న అభివృద్ధిని వివరించారు.
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నట్లు తెలిపారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను వినియోగిస్తామన్నారు. ఫోర్త్ సిటీ కోసం ఇప్పటికే 35 వేల ఎకరాల భూమిని సేకరించామని, ఫార్మా, ఐటీ, జీసీసీ లకు కేంద్రంగా మారుస్తామన్నారు.
ALSO READ: జీఎస్టీ తగ్గుదల వేళ న్యూమారుతి సుజుకి విక్టోరియస్ ఆవిష్కరణ
హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగుళూరు మీదుగా బుల్లెట్ రైలు వేయాలని ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో కలిసి రావాలని వ్యాపార వేత్తలను కోరారు. తెలంగాణలో మీరు, మీ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని, ఎక్కడో పెట్టుబడులు పెట్టేబదులు తెలంగాణకు రావాలని విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడులు పెట్టేవారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల అవసరాలకు తగట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ప్రతి ఏటా ఇంజరింగ్లో లక్ష మందికి పైగా విద్యార్థులు పాస్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులు-మేధస్సు అవసరమన్నారు. పోలీసు ర్యాంకింగ్ లో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందన్నారు. పన్నుల రాబడిలో దేశంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. డ్రగ్స్ అరికట్టడంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తోందన్నారు.
తెలంగాణకు పోర్టు లేదని, అందుకే మచిలీపట్నం పోర్టు కనెక్టవిటీ ఉండేలా ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలియజేశారు. 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ నుంచి ఉత్పత్పి అవుతోందన్నారు. వచ్చేనెలలో హార్వర్డ్ యూనివర్సిటీని సందర్శిస్తానని తెలిపిన సీఎం రేవంత్, పరిపాలన చెయ్యాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమన్నారు.
ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్కు చురకలు అంటించారు. తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారని అన్నారు. ఇష్టరాజ్యంగా పరిపాలన సాగిస్తే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారన్నారు. నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదన్నారు.
ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికాకే నష్టమన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతానని అన్నారు. అమెరికా కాదంటున్న సంస్థలు ఇండియాకి రావాలని, వాటికి తెలంగాణ స్వాగతం పలుకుతుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి.