Husnabad Murder: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా గడపాల్సిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (CTO) కోటి వెంకటేశ్వర్లు (61) భార్య చేతిలో హత్యకు గురయ్యారు.
వెంకటేశ్వర్లు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన మొదటి భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్మెంట్ నామినీలో రెండో భార్య పేరు ఉండటంపై మొదటి భార్యకు కోపం రావడంతో పాటు ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: మంత్రి పదవి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వడానికి చాన్సు లేదు.. కోమటిరెడ్డి మారేదీ లేదూ!
ఆదివారం సాయంత్రం ఇంట్లో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాజమణి ఇంట్లోని రోకలిబండతో వెంకటేశ్వర్లు వెనుక భాగంలో బలంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మొదటి భార్య రాజమణితో పాటు ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Also Read: పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్పోర్ట్కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!