Viral News: ఓ యువజంట పీకల దాకా తాగి నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ర్యాష్ గా కారు నడపుతూ యాక్సిడెంట్ చేయడమే గాక.. బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా 3 గంటల పాటు న్యూసెన్స్కు పాల్పడ్డారు. దీంతో యువజంటకు కోర్టు సరికొత్త షరతుతో బెయిల్ మంజూరు చేసింది.
వివరాల ప్రకారం.. వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన తీగుళ్ల దయాసాయి రాజ్( 28), తన స్నేహితురాలు(25) ఇద్దరూ కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్లో పార్టీకి హాజరయ్యారు. ఈ యువజంట పార్టీలో పీకలదాకా మద్యం తాగారు. మద్యం తాగాక దయాసాయిరాజ్ కారు నడిపించుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నం. 1లోని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి సమీపంలో అతివేగంగా డివైడర్ను ఢీనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు గాల్లోకి ఎగిరి రోడ్డుకు రెండోవైపు పడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన స్థలంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ యువజంట హల్చల్ చేశారు. తాము అసలు మద్యమే సేవించలేదని.. ఎందుకు పరీక్షలు చేస్తున్నారని సుమారు 3 గంటలు నానా హంగామా చేశారు.
తమపై ఎలా కేసు పెడుతారని..? తమ కారు ఎవర్నీ ఢీకొట్టలేదని పోలీసులతో గొడవకు దిగారు. ఫైనల్ గా ఇద్దరికీ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచారు. పోలీసులతో అతిగా ప్రవర్తించడంతో పాటు పీకల దాకా తాగి భారీ యాక్సిడెంట్ చేయడమే కాకుండా న్యూసెన్స్కు పాల్పడడడంతో రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. అయితే నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. వినూత్నమైన షరతును విధించింది. 15 రోజుల పాటు రోజూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి సైన్ చేయడంతో పాటు ఉదయం 10నుంచి 12 గంటల వరకు అక్కడున్న రిసెప్షన్ వద్ద ఉండి పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులకు స్వాగతం పలకాలనే షరతు కింద బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెండ్రోజులుగా దయాసాయిరాజ్తో పాటు అతడి స్నేహితురాలు పీఎస్కు వచ్చి సైన్ చేసి రెండు గంటల పాటు అక్కడే ఉంటున్నారు.
ఇలా యువత పెడదారిన పట్టకుండా క్రమశిక్షణతో మెలగాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇంకాస్తా కఠిన శిక్షనే వేయాలని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.