Etela vs Bandi Sanjay: ఆయన గురి తప్పకుండా కొడతాడు. ఆ గురి ఎవరి వైపో ఎవరికీ తెలియనట్టుగానే ఏదో ఒకటి అంటాడు. ఆ ట్రాపులో ఇంకొకాయన పడతాడు. ఉప్పు నిప్పులా తయారైన ఆ ఇద్దరూ నేరుగా ఇప్పుడు ఒకరినొకరు ఏమీ అనుకోకపోయినా.. వారిద్దరూ ఏం మాట్లాడినా ఒకరికొకరు కౌంటర్ చేసుకుంటున్నారనే చర్చకు తావిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు.. ఆధిపత్య పోరులో వారిద్దరి ఈటెల వంటి మాటలెలా దుమ్ము రేపుతున్నాయి..?
లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈటెల రాజేందర్ రైట్ వింగైన బీజేపీ బాట పట్టాక.. ఆయన పార్టీలో ఎలాంటి పరిస్థితులెదుర్కొంటున్నాడన్న చర్చ ఆది నుంచీ కొనసాగుతోందే. అయితే, ఆయనకు పూర్తి కాంట్రాస్ట్ గా రైట్ వింగ్ కు కేరాఫ్ అన్నట్టుగా హిందుత్వనే తన శ్వాసగా చెప్పుకునే తన జిల్లాకే చెందిన బండి సంజయ్ కూడా బీజేపీలో కీలకం కావడంతోనే ఇప్పుడు డిష్యుం డిష్యుంకు కారణమవుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నానుడికి తగ్గట్టుగా ఈ ఇద్దరి నేతల వ్యవహారం.. ఈటెల బీజేపీలో చేరిన్నాట్నుంచే బీజేపీకి తలబొప్పి కట్టిస్తోంది. ఈమధ్య కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ తెరపైకొచ్చారు.
కొద్దిరోజుల క్రితం ఈటెల మాట్లాడుతూ కుల, మత ప్రాతిపదికన తెలంగాణాలో ఓట్లు రాలవంటూ మీడియా ముందు కామెంట్ చేశాడు. ఆయన జనరల్ గా చేసిన కామెంటే అయి ఉండొచ్చు.. లేదా, హిందుత్వ అంటూ బీజేపీని సెక్యులర్ విధానానికి దూరం చేస్తున్నారనుకునేవారికి ఈటెల చురకలే కావచ్చుగానీ.. ఆయన మాటలకు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు నేతల వివాదం మరోసారి తెరపైకొచ్చింది.
ఈటెల గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి ఎంపిక, కొనసాగింపు నుంచి ఏ పార్టీ మీటింగైనా బండి సంజయ్ హుజూరాబాద్ నుంచే ఎక్కువగా నిర్వహించడమూ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా హుజూరాబాద్ వేదికగా ఆయన బూత్ లెవల్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ హిందుత్వే తన శ్వాస అంటూ మాట్లాడారు. 20 శాతం ఉన్నవారు ఐక్యత ప్రదర్శిస్తే లేనిది.. 80 శాతం హిందువులను ఐక్యం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో హిందువుల ఇళ్లకు గడప గడపకూ తిరిగి తాను ఓట్లడిగి బీజేపీని అధికారంలోకి తేవడానికి తనవంతు పాత్రను పోషిస్తానంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణాలో కుల, మతాల ప్రాతిపదిక ఓట్లు రాలవని మాట్లాడిన కొద్దిరోజులకే బండి సంజయ్.. ఈటెల ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ కేంద్రంగానే బీజేపీ అంతర్గత సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.
సంజయ్ ఎవరిని ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అన్న చర్చ నుంచి.. నేరుగా ఈటెలపైకే ఎక్కుపెట్టిన బాణాల్లా చర్చకొచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్ కు వచ్చిన ఈటెల మాత్రం బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవంటూనే.. ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు సహజమంటూ మాట్లాడటం ఈటెల వర్సెస్ బండి మధ్య ఉన్న విభేదాలను బలపర్చింది. అయితే, విభేదాలనేవి సోషల్ మీడియా సృష్టేనని… స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసే పనిచేస్తామని.. హుజూరాబాద్ సమావేశంపై తనకు సమాచారముందని.. వ్యక్తిగత కారణాలవల్లే తాను హాజరు కాలేకపోయినట్టు ఆయన వెల్లడించారు. అదే సమయంలో అంత లెఫ్టే బ్యాక్ గ్రౌండ్ ఒరియేంటేషన్ ఉన్న ఈటెల.. మావోయిస్టుల ఎన్ కౌంటర్స్ పై అమిత్ షా స్టాండే తన స్టాండ్ అని బల్లగుద్ది చెప్పడం కూడా మారుతున్న రాజకీయాలను కళ్లకు కట్టింది.
బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి వచ్చాక ఈటెల రాష్ట్ర అధ్యక్షుడవుతానే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ, దాన్ని పార్టీలోని అంతర్గత ప్రత్యర్థులు అడ్డుకున్నారనే ప్రచారం కూడా జరగడం.. అంతర్గత ప్రత్యర్థుల పాచిక పారి ఆయనకు అధ్యక్ష పీఠం దక్కకపోవడంతో.. ఈటెలలో డిసప్పాయింట్మెంట్ కనిపించడం సహజం. కానీ, దాన్నెక్కడా ఆయన బయటకు వెళ్లగక్కకుండానే జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ, ఆయన అక్కడక్కడా చేసే వ్యాఖ్యలతో.. ప్యూర్ హిందుత్వ వాదులను మాత్రం రెచ్చగొడుతున్నారనే వాదన తాజాగా బండి వ్యాఖ్యల తర్వాత వినిపిస్తోంది. మొత్తంగా ఈటెల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడున్న బీజేపీతో ఇలాగే కొనసాగుతుందా.. లేక, ఇంకేవైనా భవిష్యత్తులో జరుగొచ్చా లేదా తెలియదుగానీ.. ఆయన ట్రాప్ లో మాత్రం రైట్ వింగ్ నేతలు పడిపోతూ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనే సంకేతాలనిస్తున్నారు.
Story By Venkatesh, Bigtv Live