Pharma Company Blast: తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల్లో పేలుళ్లు కంటిన్యూ అవుతున్నాయి. కనీసం మూడు నెలలకు ఒక ఘటన జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వెంటనే వాటిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది?
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పోచంపల్లి మండలం దొంతిగూడెం గ్రామంలో ఉన్న హజే ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కంపెనీలోని రియాక్టర్ పేలిపోయింది. దీంతో పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలో మంటలు పరిశ్రమ అంతటా వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకున్నారు పలువురు కార్మికులు.
వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్, నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
రాత్రి వేళ షిఫ్టులో ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు. రియాక్టర్లో సాల్వెంట్ నింపే ప్రక్రియలో ఒత్తిడి అమాంతంగా పెరగడంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 20 కార్మికులు ఉంటారని చెబుతున్నారు.
రియాక్టర్ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఎట్టకేలకు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పరిశ్రమలో గడిచిన మూడు నెలల్లో ఇది రెండో ప్రమాదం. అయినా కార్మికుల భద్రతను కంపెనీ యాజమాన్యం గాలికి వదిలేసిందని అంటున్నారు కార్మికులు.
ALSO READ: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
ఫార్మా కంపెనీలో ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పలువురు కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fire at Yadadri Pharma Company
Telangana: A reactor explosion triggered a fire at Azolo Pharma in Dothigudem, Yadadri district. Ten workers were injured, two critically. Police launched rescue operations. Locals were alarmed by the blast. This is the second accident in 3 months pic.twitter.com/GMEYZ41ihx
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026