All-Party MPs Meet: ఒక మంచి ఆలోచన. ఒక విన్నూత్న యత్నం. రాష్ట్రం అంటే కేవలం అధికార పార్టీ చేసే ప్రయత్నం మాత్రమే కాదు.. ఒక బాధ్యతగా.. ఒక నిబద్ధతగా.. అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్లే సరికొత్త ప్రయోగం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి.. అందరూ కలసి సాగించే ఓ మహత్తర కార్యం..
ప్రజాభవన్లో ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలను క్లియర్ చేసుకోవడమే ఎజెండాగా ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుతారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాల్ చేసి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం దగ్గర క్లియర్ కావాల్సిన ఫైళ్లు చాలా ఉన్నాయి. అన్ని పార్టీల ఎంపీలు కలిసి పోరాడితే వాటిని సాధించొచ్చన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు.. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కేంద్ర నిధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పదేళ్ల కాలంలో.. తెలంగాణకు పది లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చామంటున్నారు బీజేపీ ఎంపీలు. అన్ని ఆధారాలను పబ్లిక్ డొమైన్లో పెట్టామని కూడా చెబుతున్నారు. కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీజేపీల మధ్య గతంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు సైతం నడిచాయి.
ఇప్పుడు ఎవరు ఏమిటో తెలిసిపోనుందా? తమకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కావాలో.. లేక స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కావాలో.. తేట తెల్లం కానుందా? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్.. కి బీజేపీ నేతలు తరలి వస్తారా? లేక మీకు మీరే మాకు మేమే.. అంటూ.. లైట్ తీస్కుంటారా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఒక వేళ ఈ మీటింగ్ కి రాష్ట్రం తరఫున కేంద్రంలో మంత్రి పదవులు పొందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తే ఎలా అర్ధం చేసుకోవాలి? రాకుంటే ఎలా అర్ధం చేసుకోవాలి? అన్న చర్చకు ఆస్కారమేర్పడుతోంది?
Also Read: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తిరిగి వస్తూ..
ఇప్పటికే పలు వేదికలపై నుంచి పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు.. ప్రాజెక్టులు తీసుకురావాలన్న ప్రతిపాదనలు చాలానే చేశారు. కేంద్రంలో అధికారంలో పాలుపంచుకుంటున్న స్థానిక నాయకులు.. ఇక్కడి అభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఒక వేళ మీరు అలా చేయకుంటే.. మీరు అడ్డు పడుతున్నట్టే అన్న మాటల మంటలు కూడా చెలరేగాయ్. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ ద్వారా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే చూపించమన్నారు కూడా. అలాంటి వారు నేటి సమావేశానికి వస్తారా? రారా? తాము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామని.. చెప్పడం మాటలకే పరిమితమా? అన్నది తేలాల్సి ఉంది.