Hyderabad: భాగ్యనగర గణేష్ శోభాయాత్ర.. దీనిది ఏడు దశాబ్దాల చరిత్ర. సాగరమంత జనం.. వారిమధ్య జరిగే మహా నిమజ్జనం. హైదరాబాద్ గణేషుడంటేనే వరల్డ్ ఫేమస్. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతకు పోయిందన్న బ్రేకింగ్ న్యూస్, ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూశాకే.. పండగ సంబరం ముగిసినట్టు. మొత్తంగా హైదరాబాద్ సంస్కృతిని, భక్తిని ఏకం చేసేది శోభాయాత్ర.
నగరంలో పోలీసులు ఆంక్షలు
అందుకే నగర నలుమూలల నుంచి నిమజ్జనోత్సవాలు చూడటానికి తరలివస్తారు. ఈసారి 40 లక్షల మంది భక్తులు శోభాయాత్ర పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించారు.
ఉదయం 6నుంచి రేపు ఉదయం 10గంటల వరకు..
ఈ క్రమంలో పోలీసులు పలు ఆక్షలు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు సిటీలోకి ప్రవేశం లేదని ఆక్షలు విధించారు. భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. సిటీలో ఉన్న భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు సైతం బయటకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. భారీ వాహనాల ఓనర్లు, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
నగరంలోకి భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ
జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లోని ఎంజీబీఎస్కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయనున్నారు. శంషాబాద్ మీదుగా బెంగళూరు, మహబూబ్నగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ వద్దనే నిలిపివేయనున్నారు. వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఉప్పల్ వద్ద, విజయవాడ, నల్లగొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఎల్బీనగర్ వద్ద నిలిపివేయనున్నారు. వికారాబాద్, మొయినాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మెహిదీపట్నంకు పరిమితం చేయనున్నారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్లో నిలిపివేయనున్నారు. నిన్న రాత్రికి ఎంజీబీఎస్ చేరుకుని, మళ్లీ తెల్లవారుజామున తిరిగి వెళ్లే అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు దారి మళ్లించారు.
Also Read: రేవంత్ అందరివాడు.. జనం మెచ్చిన నేత.. ప్రజల హనుమంతు..
ఇవాళ అర్థరాత్రి ఒంటిగంట వరకు నడవనున్న మెట్రో
ఈ క్రమంలో మెట్రో అధికారులు భక్తులకు శుభవార్త చెప్పారు. మెట్రో సమయంలో మార్పులు చేస్తూ.. ప్రకటన విడుదల చేశారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఇవాళ ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలు వెళ్లిన వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశారు అధికారులు. విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలని సూచించారు.