Jagadish Reddy: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ (గులాబీ) అధినేత కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు నిజమైన అభివృద్ధి దక్కిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా పాల్గొన్నారు.
కేసీఆర్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్
జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజల తలసరి ఆదాయాన్ని ఊహించని రీతిలో పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి నేడు దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచిందని కొనియాడారు. కేసీఆర్కు ఎవరినీ తొక్కడం తెలియదని, ఆయన నల్గొండ జిల్లాకు చేసిన 300 అభివృద్ధి పనులను కేవలం మూడు నిమిషాల్లోనే తాను లెక్కగట్టగలనని సవాల్ విసిరారు.
పాలన చేతకాక తిట్ల పురాణం
కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని, నోరు తెరిస్తే కేసీఆర్ను తిట్టడం తప్ప వారికి మరో పని లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ‘అప్పుడూ అవే తిట్లు.. ఇప్పుడూ అవే తిట్లు.. మాకు వచ్చింది ఏమీ లేదు’ అనే నిరాశలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా, వాటిని రైతులకు సక్రమంగా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప కాంగ్రెస్కు ఏమీ తెలియదని ధ్వజమెత్తారు.
మహిళలకు క్షమాపణ చెప్పాలి
నల్గొండ సీఎం సభలో మహిళలకు ఇచ్చిన హామీలపై స్పష్టత వస్తుందని అందరూ ఎదురుచూశారని, కానీ అక్కడ మహిళలకు తీవ్ర నిరాశే ఎదురైందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. దీనికిగానూ ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్లు టచ్ కూడా చేయలేరన్నారు.
Also Read: కృష్ణా జిల్లాలో ఘోరం.. బైక్కు కట్టేసి.. చెరువులో మామ, అల్లుడి మృతదేహాలు!
అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ‘మేము నల్గొండ సభకు లెటర్ రాస్తేనే వచ్చారా? మరి అసెంబ్లీ కోసం మేము లెటర్ రాయాలా?’ అని నిలదీశారు. ధైర్యముంటే అసెంబ్లీ పెట్టాలని, అప్పుడే ఎవరు వస్తారో ఎవరు రారో తేలిపోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాయంటేనే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ కుమార్, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలతో పాటు నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పల్లె రవికుమార్, రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.