Hyderabad Fraud: హైదరాబాద్ లోని మై హోం భుజా అపార్ట్ మెంట్స్ పేరు వినగానే.. గణేష్ లడ్డూ వేలం గుర్తుకొస్తుంది. ఇక్కడ ఉండేవారు లక్షల రూపాయలకు లడ్డూను వేలంలో కొని ఆ డబ్బును సామాజిక సేవలకు వినియోగిస్తుంటారు. సరిగ్గా దీనినే అవకాశంగా చేసుకున్నారు కొండపల్లి గణేష్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు.
మై హోం భుజాలో ఉంటున్నావారితో పరిచయాలు పెంచుకోవడానికి వినాయక చవితిని అవకాశంగా మార్చుకున్నారు. వినాయకుడి పూజల తర్వాత వేలం వేసిన లడ్డూను 51 లక్షలకు సొంతం చేసుకున్నారు. అపార్ట్ మెంట్ కమ్యూనిటీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లడ్డూ కోసం యాబై లక్షలు పెట్టిన వీళ్లను అందరూ సంపన్నులని భావించారు.
ఆ తర్వాత ఇద్దరు తమ అసలు ప్లాన్ ను అమలు చేశారు. తాము చేస్తున్న రియల్ ఎస్టేట్.. ఇతరత్రా వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే నెలకు ఆరు శాతం లాభాలు ఇస్తామంటూ ఆఫర్ పెట్టారు. వీరి మాటలు నమ్మిన మై హోం భుజాలో ఉంటున్న దంపతులు రూ. 31 లక్షలు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తరువాత ముఖం చాటేసిన గణేష్ కిరణ్ లు.. ఎప్పుడు డబ్బు గురించి అడిగినా దాటవేస్తూ వచ్చారు.
Also Read: పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!
అదే సమయంలో మరికొందరి నుంచి కూడా పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి అపార్ట్ మెంట్ ఖాళీ చేసి ఉడాయించారు. బాధితులు చెబుతున్న దానిని బట్టి ఇద్దరు కలిసి దాదాపు రూ.4 కోట్లు వసూల్ చేసినట్టుగా తెలుస్తోంది. పలువురు రిటైర్డ్ ఉద్యోగుల జీవితకాల పొదుపులకూ ఈ ఇద్దరు ఎసరు పెట్టారని తెలిసింది. మోసం చేసిన గణేష్, కిరణ్ ఆచూకీ తెలియకపోవడం.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు