Indiramma Griha Towers Lottery: హైదరాబాద్ సిటీ ఔటర్రింగ్ రోడ్ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ హోమ్స్ టవర్స్లో ఇళ్ల కేటాయింపు రంగం సిద్ధమైంది. లాటరీ ప్రక్రియ ద్వారా పూర్తి కానుంది. ఆగస్టు 27న లాటరీ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి దాదాపుగా అన్నిపనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకున్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్లో ఇళ్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ చుట్టూ ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 పైగానే దరఖాస్తులు వచ్చాయి. అందులో సుమారు 40 వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు సమాచారం. సీజీజీ ఆధ్వర్యంలో 360 డిగ్రీ విధానంలో ఆన్ లైన్లో అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగదారులు దరఖాస్తు చేశారా? లేదా? ఫ్లాట్కు దక్కించుకునేందుకు అర్హులా? అనర్హులు కాకపోతే ఎందుకు? అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది? వంటి వివరాలను అధికారులు వెబ్ సైట్లో స్పష్టంగా పొందుపర్చనున్నారు.
అర్హుల జాబితా వెబ్సైట్ https://tghb.telangana.gov.inలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 23 లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చు. లాటరీకి అర్హత సాధించిన వారి జాబితాను ఈనెల 25న ప్రకటించనున్నారు అధికారులు. ఆగస్టు 27-30 మధ్య నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లను కేటాయించనున్నారు అధికారులు. లాటరీలో పేర్లు వచ్చిన వారికి ఎల్ఐజీ ఫ్లాట్లు కేటాయిస్తారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున లాటరీ తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు.
ALSO READ: సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులతో సహా రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం డ్రా నిర్వహించబడుతుంది. ప్రతి కేటగిరీకి దరఖాస్తుదారులలో 20 శాతం మందితో కూడిన జాబితాను తయారు చేస్తారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు. అర్హుల గుర్తింపు నుంచి లాటరీ వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. లాటరీ ద్వారా పేర్లను ఎంపిక చేస్తారు. సందేహాల కోసం, దరఖాస్తుదారులు 040‑24603572 నంబర్ను సంప్రదించవచ్చు.