Indiramma Indlu Scheme: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. పేదవారి సొంతింటి కలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా సొంతిల్లు లేని వారి జాబితా కూడ తేలిపోయింది. దీనితో రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇప్పటికే పలు దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి అందాయి. ఇటీవల నిర్వహించిన గ్రామసభలలో లబ్దిదారుల వివరాలను కూడా అధికారులు చదివి వినిపించారు. అలాగే అర్హులైన వారి నుండి దరఖాస్తులను కూడా స్వీకరించారు.
కొందరు లబ్దిదారులు తమకు ఇందిరమ్మ గృహం మంజూరైందా లేదా అనే సంకోచంలో ఉన్న పరిస్థితి. ఇలాంటి లబ్దిదారులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఒక్క క్లిక్ తో తమ సమాచారాన్ని సులువుగా తెలుసుకొనేలా వీలును ప్రభుత్వం కల్పించింది. అది కూడా మొబైల్ ఫోన్ తో తమ దరఖాస్తు స్టేటస్ వీలు కల్పించడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తు ఏ స్టేజ్ లో ఉంది? ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా? ఇల్లు మంజూరైందా ? లేదా? మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? వంటి వివరాల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులను ప్రభుత్వం గుర్తించింది. అలాంటి కష్టాలకు ముగింపు పలుకుతూ.. మొబైల్ ఫోన్ లో దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ప్రకటించింది. ఆ పూర్తి విధానం మీకోసం..
మీ దరఖాస్తు ఇలా చెక్ చేసుకోండి
దరఖాస్తుదారులు తమ పనిని మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఉన్న చోటు నుంచే దరఖాస్తు స్దితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు తప్పనిసరిగా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్లను కలిగి ఉండాలి. ఈ వివరాలు దగ్గర ఉంచుకొని https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి. ఈ వెబ్ సైట్ లో గ్రీవెన్స్ స్టేటస్ లోకి వెళ్లి సెర్చ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ తగిన వివరాలు నమోదు చేస్తే చాలు, వెంటనే దరఖాస్తు పూర్తి స్టేటస్ మీ ముందు ఉంటుంది. అంతేకాదు.. దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్సైట్ ద్వారానే తెలియజేసే అవకాశం కూడా ఉంది.
Also Read: CM Revanth Reddy: రాష్ట్రానికి కేంద్ర సాయం సున్నా.. పోరాటానికి సిద్దం కావాలని సీఎం పిలుపు
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. పనులు మానేసి ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, జస్ట్ ఒక్క క్లిక్ తో స్టేటస్ తెలుసుకోండి అంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరెందుకు ఆలస్యం.. మీ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోండి.. నెట్ ఆన్ చేసి, సైట్ లోకి వెళ్ళండి.. అన్ని వివరాలు తెలుసుకోండి.