Sanjay Kumar: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా.. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా చైర్ పర్సన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
చైర్ పర్సన్ అభ్యర్థులుగా కౌన్సిలర్లుగా విజయం సాధించిన వాణి, అడువాల జ్యోతి పేర్లను తాను ప్రతిపాదించినట్లు సంజయ్ కుమార్ వెల్లడించారు. వీరిద్దరూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని.. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మహిళా నాయకులకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం తాను సూచించిన ఇద్దరిలో ఒకరిని ఖచ్చితంగా ఎంపిక చేస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీరుపై సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తాను కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తే.. జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కండువా వేసుకోకుండా స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారని ఆరోపించారు. తమది తరతరాల కాంగ్రెస్ కుటుంబమని, తన తాతల కాలం నుండే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పార్టీకి సేవలందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేవలం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.
జగిత్యాలలో జరిగిన ఎన్నికల పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై పార్టీ ఇంచార్జ్ బసవరాజు సారయ్య ఇప్పటికే అధిష్టానానికి పూర్తి నివేదికలు పంపారని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం జరగనున్న చైర్ పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ హైకమాండ్ ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తానని సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు.
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కౌన్సిలర్ గా గెలుపొందిన వాణి, జ్యోతి పేర్లను చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించాను
వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పని చేసిన అనుబంధం
ఇద్దరూ బలమైన బీసీ సామాజిక… pic.twitter.com/i0ekKRCuTc
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2026