Future City: తెలంగాణలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఆదివారం ఫ్యూచర్ సిటీని దర్శించారు. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫోర్త్ సిటీని సందర్శించిన జర్నలిస్టులు, అక్కడి వాతావరణం పట్ల ఆసక్తి చూపించారు.
డీజేహెచ్ఎస్ సభ్యుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆ ప్రాంతంలో జరిగింది. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని సభ్యులు కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమకు ఆమోద యోగ్యమని స్పష్టంచేశారు.
అందుకోసం చొరవ చూపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆరు నెలల్లోగా ఇచ్చేలా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రికి డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి సూచించారు.
హైదరాబాద్కు నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని మనసులోని మాట బయటపెట్టారు జర్నలిస్టులు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ ఉందన్నారు. స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయన్నారు. దీనివల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు.
ALSO READ: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ప్రేయసిని విదేశానికి పంపాడని ఆమె తండ్రిపైనే!
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలన్నారు.
ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున దాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్, నాగరాజు మాట్లాడారు.