Kavitha: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయా? ఆయా వ్యక్తులు రేపో మాపో సిట్ ముందుకు రానున్నారా? ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ఈ ఉచ్చులో చిక్కుకున్నట్టేనా? ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారా? ఆమె మాటలు మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఫోన్ ట్యాపింగ్ పై విస్తుపోయే నిజాలు బయట పెట్టారు. ఇంట్లో వారి ఫోన్లు ట్యాప్ అనేది నిజంగా వినడానికి కూడా బాగాలేదన్నారు. తనకు దగ్గరగా ఉన్నవారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసిందన్నారు.
ఈ కేసు వెనుక రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకోరని మనసులోని మాట బయటపెట్టారు. కేసీఆర్ భోళాశంకరుడి లా ఉంటారని చెబుతూనే, ఆయనకు ఇవ్వడమే తెలుసన్నారు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరన్నారు. ఇలాంటి విషయాల్లో ఆయన తన స్థాయి దిగజార్చుకుంటారని అనుకోవడం లేదని తెలిపారు. కింది వాళ్లు ఏమైనా తప్పు చేశారా? అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇంతకీ కిందిస్థాయి వారంటే అధికారులా? లేక పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులా? అనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైపోయింది.
ALSO READ: తిరుపతి, హైదరాబాద్ల్లో భారీ అగ్నిప్రమాదాలు, భారీగా నష్టం
కేసీఆర్ ప్రభుత్వంలో తన కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ వచ్చిన ఆరోపణలు బాధాకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లు ట్యాప్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు కవిత. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును ఊదరగొడుతున్నారని అభిప్రాయపడ్డారు.ఈ వ్యవహారంపై నిజాలు వెలుగులోకి రావాలంటే విచారణ పక్షపాతం లేకుండా జరగాలన్నారు. కవిత వ్యాఖ్యలతో ఫోన్ ట్యాపింగ్ కేసు చర్చనీయాంశంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవంబర్ నెలకు సంబంధించిన డేటా సిట్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా ఆనాడు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయో వారికి నోటీసులు ఇచ్చి సమాచారం సేకరిస్తోంది. అంతకుముందు డేటా మొత్తం డిలీట్ చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన దాదాపు 1000 ఫోన్లు ట్యాప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో తెలంగాణకు సంబంధించి 650 మంది, ఏపీకి 350 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ గుట్టు విప్పే పనిలోపడ్డారు సిట్ అధికారులు.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించడంతో ఆయన్ని తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో మస్తాన్ మాట్లాడిన కాల్ డేటాను అధికారులు వినిపించారు. వాటిని విని ఆయన షాకైనట్టు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ నుండి మస్తాన్ ఫోన్ ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన నేతలు, వారి అనుచరులతో మస్తాన్ మాట్లాడిన ఫోన్ కాల్స్ను ప్రభాకర్రావు టీమ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రాబోయే రోజుల్లో ట్యాపింగ్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.