BRS Strategy: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సరికొత్త వ్యూహానికి కసరత్తు చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ ‘త్రిముఖ వ్యూహాన్ని’ సిద్ధం చేస్తున్నారు. కేడర్లో జోష్ నింపడం, అగ్రనేతల నిరంతర పర్యటనలు, రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటం, మహిళ, నిరుద్యోగయువత క్షేత్రస్థాయి క్యాడర్ను పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయడమే లక్ష్యంగా ఈ వ్యూహానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతల వ్యూహంతో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముందుకు సాగుతున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులకు కేసీఆర్ అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సర్, పార్టీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యనేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపై వీరిద్దరూ నిరంతరం ప్రజల్లోనే ఉండేలా యాక్షన్ ప్లాన్ ఖరారైనట్లు సమాచారం. జిల్లాల పర్యటనలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభల ద్వారా ప్రజలతో నేరుగా మమేకం కావాలని గులాబీ బాస్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను, వైఫల్యాలను ఎండగట్టడంలో ఈ ఇద్దరు టాప్ లీడర్లు ముందుండి నడిపించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుత రాజకీయ వ్యూహంలో రైతు అజెండానే బీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకోబోతుంది. రుణమాఫీ అమలులో లోపాలు, రైతుభరోసా లబ్ధిదారుల కోత, సాగునీటి ఇబ్బందులు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై నిరంతర పోరాటాలు చేయాలని నిర్ణయించింది. అన్నదాతల పక్షాన నిలబడి, వారిలో భరోసా నింపడమే కాకుండా, ప్రభుత్వాన్ని కదిలించేలా ఆందోళన కార్యక్రమాలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!
ఎర్రవెల్లి నివాసంలో రెండుమూడ్రోజులకోసారి కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ భేటీ అవుతున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం సైతం భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. కొంత మంది సీనియర్ నేతలకు సైతం అందుబాటులో ఉంటూ వారికి సూచనలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో సైతం టెలికాన్ఫరెన్స్ తో దిశానిర్దేశం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. యే ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, స్థానిక సమస్యలపై ఎలా స్పందించాలనే దానిపై ఆయనే స్వయంగా స్కెచ్ వేస్తూ నేతలకుసూచనలు చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల అనంతరం కొంత నిరాశలో ఉన్న గులాబీ శ్రేణులను (కేడర్) పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయడమే లక్ష్యంగా ఈ వ్యూహం సాగనుంది. గ్రామ, మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను సమాయత్తం చేసి, సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు అధిష్టానం సమగ్ర కార్యాచరణతో ముందుకు కదులుతోంది. పార్టీ సభ్యత్వం, శిక్షణ తరగతులు, కేడర్ బలోపేతంపై దృష్టిసారిస్తున్నారు. ఈ త్రిముఖ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ మళ్లీ పాత జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. నిస్తేజంగా ఉన్న క్షేత్రస్థాయి కేడర్ను యాక్టీవ్ చేసేందుకు త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలే పెట్టుబడిగా.. రైతే కేంద్రంగా.. కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్, హరీష్ రావు ద్వయం మున్ముందు తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన హీట్ పుట్టిస్తుందో చూడాలి.
Also read: వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి