Police Operation: స్వేచ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ అంజలి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజానా తండా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయం 5:20 గంటల నుంచి 7:30 గంటల వరకు చేపట్టిన తనిఖీల్లో పోలీసులు గ్రామంలోని సుమారు 120 ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 100 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల గుడుంబా, 20 కిలోల పట్టిక, 16 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసిన వస్తువులకు సంబంధించి బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Telangana Weather: నైరుతి రుతుపవనాలు.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 48 గంటలు జాగ్రత్త
తనిఖీల అనంతరం గ్రామస్తులకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగం, చెరువుల్లో ఈత వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ వంటి అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్, క్యూ ఆర్ టీ ఫోర్స్, ఏఆర్ మహిళా పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also read: మళ్లీ ‘బాలయ్య వర్సెస్ నాగ్’.. 2027 సంక్రాంతి రేసులో మైండ్ బ్లోయింగ్ క్లాష్!