Malkajgiri Development: స్వేచ్ఛ బ్యూరో: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ మాను చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు. రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22-A కింద నిషేధిత ఆస్తుల జాబితాను పునఃసమీక్షించి, వక్ఫ్ బోర్డు పేరుతో తప్పుగా నమోదైన గృహ స్థలాల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. మల్కాజ్గిరిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏర్పాటు, సఫిల్గూడలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
విమలాదేవి నగర్లో ప్రజా భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అరికట్టాలని, అల్వాల్లో అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన భూమిని రక్షించాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలో నిలిచిపోయిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.షెడ్యూల్డ్ కాస్ట్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేయాలని, అల్వాల్ సఖి సెంటర్కు అదనపు అంతస్తు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆర్కే పురం ROB, RUB పనులతో ప్రభావితమైన బీపీఎల్ కుటుంబాలకు 2బీహెచ్కే ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: కేసీఆర్ బయటకు వస్తే గుంట నక్కలకు భయం.. జగిత్యాలలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీతారాం నగర్లో సర్వే నంబర్లు 109, 111లపై అక్రమ దావాలు, ప్రజల వేధింపులను అరికట్టాలని, కౌకూర్ దర్గా నుంచి బిట్స్ పిలాని వరకు రహదారి అభివృద్ధి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కలెక్టర్ మాను చౌదరి ఎమ్మెల్యే వినతులను సానుకూలంగా స్వీకరించి, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: రాష్ట్రంలో మెట్రో, ఎంఎంటీఎస్ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే..?