Mulugu District : గత కొన్నాళ్లుగా ఛత్తీష్ ఘఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ములుగు జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేరుస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకుల్ని దారుణంగా నరికి చంపేశారు. ఓ వైపు ప్రభుత్వం సీరియస్ గా ఉండడం, మరోవైపు భద్రతా దళాల కదలికలు ఎక్కువగా ఉండడం స్తబ్దుగా ఉంటూ వస్తు్న్న మావోలకు.. ఇటీవల కాలంలో వరుస ఎన్ కౌంటర్లు ఎదురయ్యాయి. ఈ కారణంగానే చాన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు.. సుదీర్ఘ కాలం తర్వాత జంట హత్యలతో అలజడి సృష్టించారు. ఈ చర్యతో ములుగు జిల్లాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ జంట హత్యలు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో జరిగాయి. తెల్లవారుజామున అనుమానితుల ఇళ్ల వద్దకు వచ్చిన మావోయిస్టులు ఇద్దరు యువకుల్ని బయటకు పిలిచి మరీ దారుణంగా హత్య చేశారు. మృతులు ఉయిక అర్జున్, ఉయిక రమేష్ అనే ఆదివాసీలుగా గుర్తించారు. మృతులిద్దరూ అన్నదమ్ములు కాగా.. ఉయిక రమేశ్ గ్రామ పంచాయతీ సెక్రటరి హోదాలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి హత్యతో ఈ ప్రాంతంలో మావోయిస్టులు భయం సృష్టించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ.. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నాడని రమేష్ ను చంపేసిన మావోయిస్టులు.. పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికల్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని, అందుకే చంపేస్తున్నామని మావోయిస్టులు వెల్లడించారు.
రమేష్ ని గొడ్డలితో నరికి మావోయిస్టులు చంపేశారు. ఈ క్రమంలో అతని భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమె చేతిలోకి తీసుకున్న గొడ్డలిని లాక్కుని మరీ రమేష్ ను నరిచి చంపేశారు. మావోలకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ.. భార్య కళ్ళ ముందే దారుణంగా హతమార్చి పగతీర్చుకున్నారు. రమేష్ సోదరుడు అర్జున్ ను రోడ్డ్డుపైకి లాక్కొచ్చి మరీ నరికి చంపారు. సంఘటనా స్థలంలో రెండు లేఖల్ని మావోయిస్టులు వదిలి వెళ్లారు.. ఈ లేఖలు వెంకటాపురం – వాజేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఉన్నాయి.
వీరిద్దరు.. పోలీస్ ల కోవర్టులుగా పనిచేస్తున్నారని లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. ఛత్తీస్ గఢ్ – తెలంగాణా సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లోని సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుని.. వారి ద్వారా సమాచారాన్ని పొందుతున్నారని లేఖలో మావోలు తెలిపారు.
ఈ మధ్య కాలంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్లకు.. పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. అతని తమ్ముడు అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్నులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోక పోవడంతోనే హతమార్చామని లేఖలో పేర్కొన్నారు.
Also Read : లగచర్ల కేసులో సంచలనం.. దాడిలో కేసీఆర్ కుట్రపై కోర్టుకు సాక్ష్యాలు..
మావోయిస్టుల ఘాతుకం నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో రెండు వేర్వేరు లేఖలు విడుదల చేయడంతో హత్య చేసింది మావోయిస్టులేనా, లేక ఇతర వ్యక్తులా అనే చర్చ సైతం నడుస్తోంది.