LPG Black Market: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పరిధిలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా రూ.1960కు లభించాల్సిన సిలిండర్ను కొందరు దందాగాళ్లు రూ.5500 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు గ్యాస్ కొరతతో వ్యాపారం నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ ముఠాలు అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఒక్కో సిలిండర్పై మూడు రెట్లు వరకు అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
సరఫరా వ్యవస్థలో లోపాలు, పెండింగ్ బుకింగ్స్, అక్రమ నిల్వలు, మధ్యవర్తుల జోక్యం కారణంగా సమస్య మరింత తీవ్రమవుతోంది. కొందరు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ వినియోగానికి మళ్లిస్తుండగా, కమర్షియల్ సిలిండర్లను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం వినియోగదారులపై పడుతూ హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ధరలు పెరగడానికి దారితీస్తోంది.
Also Read: మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో నవీన్ అనే వ్యక్తి ఒక్క సిలిండర్కు రూ.5500 వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అతడిని సంప్రదించగా గ్యాస్ ఏజెన్సీల నుంచే రూ.4500కు సిలిండర్ వస్తోందని, అందుకే అధిక ధరకు విక్రయిస్తున్నామని వెల్లడించినట్లు సమాచారం.
ఎల్పీజీ సరఫరాలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, సరఫరాదారులు, మధ్యవర్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సిలిండర్ల సరఫరాను తక్షణమే సక్రమం చేయడంతో పాటు బ్లాక్ మార్కెట్ దందాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమ నిల్వలు, అధిక ధరల అమ్మకాల చేస్తున్న వారి పై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?