Nalgonda Dog Attack: వీధి కుక్కల దాడులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్నపిల్లలపై వీధి కుక్కలు చేస్తున్న దాడులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న నిరుపేద దంపతుల మూడేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. చిన్నారి గొంతుపై కుక్క కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
దేవరకొండ పట్టణంలోని 11వ వార్డు మగ్దూం బాబా నగర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న అరుణ్ , సోనాం దంపతుల ముడేళ్ల కూతురు నబియాపై ఈ దాడి జరిగింది. ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిన్నారిపై ఒక వీధికుక్క ఒక్కసారిగా విరుచుకుపడింది. కుక్క దాడి ధాటికి చిన్నారి గొంతు దగ్గర తీవ్ర గాయం అయింది. అంతటితో ఆగకుండా కుక్క దాడి చేసిన సమయంలో చిన్నారి దంతాలు కూడా ఊడిపోయాయి. కూతురిని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమికొట్టారు.
రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చిన్నారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. గొంతు భాగంలో గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
Also Read: జగిత్యాల జిల్లాలో అరుదైన ఘటన..ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి!
చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో.. ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్థానిక కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని.. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల కాట్ల బారి నుంచి తమ పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వాలు, అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.