Narayanpet Security: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు నారాయణపేట జిల్లా పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో మరియు మఖ్తల్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ముఖ్య ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసు జాగిలాల సహాయంతో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ, బస్టాండ్, ప్రధాన చౌరస్తా, జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలు మరియు ఇతర ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పేలుడు పదార్థాలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే కోణంలో ప్రతి ప్రాంతాన్ని ప్రత్యేక పరికరాలతో తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా,సురక్షితంగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, సంచులు లేదా వాహనాలు కనిపించినట్లయితే వాటిని తాకకుండా వెంటనే సమీప పోలీసు అధికారులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!
అలాగే ప్రజలు వదంతులను నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అందరూ సంతోషంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Also read: మంత్రి లోకేష్తో ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ, ఆపై ఫ్యూచర్ క్యాంపస్ వ్యవహారంపై చర్చ