Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సిట్ (SIT) విచారణకు హాజరై తమ స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సీఎల్పీ మీడియా హాల్లో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరకాలం అధికారం కోసం ఆ నలుగురు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ద్వారా లభించిన ప్రాథమిక హక్కులను పూర్తిగా తుంగలో తొక్కారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురు సభ్యులు చిరకాలం అధికారంలోనే ఉండాలనే స్వార్థంతో, అక్రమ పద్ధతిలో వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా జర్నలిస్టులు, జడ్జిలు, చివరకు వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసి, ఎస్ఐబీ (SIB) సమాచారం ఆధారంగా వారిని బెదిరించారని పేర్కొన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం దారుణమన్నారు.
మహిళల స్వేచ్ఛకు భంగం.. సొంత చెల్లెలిపైనే నిఘా!
ఈ కేసులో మరో బాధితుడైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఫోన్తో పాటు తన తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తలు వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలను కూడా వినేలా మహిళల స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే దాదాపు 200కు పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని తెలిపారు. చివరకు కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. సొంత చెల్లెలి ఫోన్ను కూడా వదలకుండా ట్యాపింగ్ చేశారంటే ఆ కుటుంబం ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒకవేళ ఆ కుటుంబం మళ్లీ అధికారంలోకి వస్తే ఏకంగా ఇళ్లల్లో సీసీ కెమెరాలు పెట్టి చూస్తారని ఎద్దేవా చేశారు.
పగ కోసం కాదు.. చట్టబద్ధమైన శిక్ష కోసమే
తాము గత ప్రభుత్వ హయాంలోనే దీనిపై ఫిర్యాదు చేశామని, ఇప్పుడు సిట్ అధికారుల పిలుపు మేరకు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా తమ వాంగ్మూలాన్ని ఇచ్చామని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ పోరాటం ఎవరి మీదో పగ తీర్చుకోవడానికి కాదని, భావితరాలకు ఒక గుణపాఠం కావాలని, ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికేనని స్పష్టం చేశారు. జూన్లో పోలీసులు ఛార్జ్షీట్ వేస్తామని చెప్పారని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మూల సూత్రధారుడితో పాటు, దీని వెనుక ఉన్న ‘టీమ్’ లోని ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడాలని, అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు డిమాండ్ చేశారు.
Also Read: ప్రియుడి కోసం కన్నకొడుకును చంపిన తల్లి.. కర్నూలులో ఘోరం!
ఓట్లు అడిగే హక్కు మీకు లేదు: ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి
గత ప్రభుత్వం పౌరుల హక్కులను హరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
జడ్జీలు, జర్నలిస్టులు, నటులు, రాజకీయ నేతలు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాప్ చేశారు.
– ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి pic.twitter.com/JPbsnCXviD
— BIG TV Breaking News (@bigtvtelugu) June 1, 2026