Solar Village: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. రఘునాథపాలెం గ్రామంలో అమలవుతున్న సోలార్ మోడల్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.
సోలార్ రూఫ్టాప్ల పురోగతి మొత్తం 1081 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారని, వారిలో 821 ఇళ్లలో సోలార్ రూఫ్టాప్లు ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 110 ఇళ్లలో సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటు పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. రఘునాథపాలెంను భవిష్యత్తులో “సోలార్ విలేజ్”గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి ఇంటికి కనీసం 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గ్రామంలోని కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర సామూహిక ప్రదేశాలపై కూడా సోలార్ రూఫ్టాప్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also read: దత్తత పాప నవ్వులు.. దంపతుల కళ్లలో ఆనంద బాష్పాలు.. కలెక్టరేట్లో సందడి!
గ్రామంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. సోలార్ రూఫ్టాప్ల ద్వారా ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సెన్సస్–2027 కార్యక్రమంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజలు సరైన సమాచారాన్ని అందించాలని, ఎటువంటి అపోహలకు లోనుకాకుండా తప్పుడు సమాచారం ఇవ్వవద్దని సూచించారు. రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత, ఆర్ఐ వహీద్ పాల్గొన్నారు.
Also read: మెదక్ ఆదర్ష బ్యాంక్లో నయా మొసం.. నకిలీ బంగారంతో రూ.1.79 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్!