
Revanthreddy : దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీ జెండాను రేవంత్ ఎగురవేశారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్ ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు.
దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకే.. మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని అందుకే భయంతో మోదీ కొవిడ్ రూల్స్ తీసుకొచ్చారని రేవంత్ ఆరోపించారు. దేశ సమగ్రతను పణంగా పెట్టి బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి ఇప్పుడు దేశం మీద పడ్డారని రేవంత్ ఆరోపించారు.
దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని చెప్పారు. దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్ను నిలబెట్టారని చెప్పారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీలో దోషి ఎవరో తేలాలన్నారు. సీబీఐ విచారణ అనగానే బీజేపీ ,సిట్ విచారణ అనగానే బీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు రాజకీయ అవసరాలకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలా వద్దా అనేదానిపై చర్చ జరుగుతుందని రేవంత్ అన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారేని గుర్తుచేశారు. పార్టీ మారిన వారికి పదవులు ఇచ్చారని ఇది కూడా అవినీతి కిందే వస్తుందన్నారు.
అందుకే 2018 నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై విచారణ జరగాలన్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన వారికి ఎలాంటి లాభం జరిగిందో.. ఆ వివరాలు అన్ని సీబీఐకి ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.