Revenue Corruption: స్వేచ్చ బ్యూరో: రెవెన్యూ శాఖ అవినీతి ఆరోపణల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా.. ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల అండ లేకుండా అధికారుల్ని కలిస్తే పని జరిగే ప్రసక్తే లేదన్న ఆక్షేపణలున్నాయి. కాగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులను ఇక్కడి నుంచి తప్పిస్తేనే కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చనే అభిప్రాయం మండలాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి అక్రమాల బాగోతంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలోని ఓ మండల ఇన్చార్జ్ తహసీల్దార్ వ్యవహారశైలి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు అప్పగించే ప్రభుత్వ పనులను అందరికంటే ముందుగా పూర్తి చేసి ‘నెంబర్ వన్’ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న సదరు అధికారి, అదే ముసుగులో క్షేత్రస్థాయిలో అమాయక రైతులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైస్థాయిలో ఉన్న మంచి పేరును అడ్డం పెట్టుకుని, క్రిందిస్థాయిలో సాగిస్తున్న ఈ అవినీతి దందాపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
భూమి క్రయవిక్రయాలు చేసే రైతులు మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఒక ఎకరా విక్రయిస్తే ప్రభుత్వ విలువ ప్రకారం చలానా రూపంలో చెల్లించాలి. డాక్యుమెంట్ ఛార్జీలు, మీసేవా కేంద్రాల నిర్వాహకుల కమీషన్ అదనంగా చెల్లించుకోవాలి. ఇవే కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించుకునే డబ్బులదే ప్రధాన సమస్యగా మారింది. డబ్బులిస్తేనే పనులు సాఫీగా జరుగుతాయి. లేదంటే పెండింగ్లోనే పెడతారు.
Also read: Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!
రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు బల్ల కింద చేతివాటం ప్రదర్శించే వారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అవినీతి నడుస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే తదితర మార్గాల్లో తమ బినామీల నెంబర్లకు డబ్బులు పంపించుకుంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు.
ఈ దందా అంతా తనపైకి రాకుండా ఉండేందుకు సదరు అధికారి స్థానిక ఆన్ లైన్ & మీ-సేవ కేంద్రాల నిర్వాహకులను అడ్డం పెట్టుకున్నారు. రైతుల నుండి డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోతే మీ-సేవ నిర్వాహకుల లాగిన్ పనులను ఆపేస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మీ సేవా నిర్వాహకులు బహిరంగానే చెబుతున్నారు. గతంలో ఓ మీ-సేవ నిర్వాహకుడిపై సదరు అధికారి బహిరంగంగానే చిందులు తొక్కినట్లు సమాచారం. అధికారి వేధింపులు తట్టుకోలేకే మేము రైతుల నుండి డబ్బులు వసూలు చేసి ఇస్తున్నాం. దీనివల్ల సమాజంలో మాకు చెడ్డపేరు వస్తోంద అని మీ సేవ నిర్వాహకులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.
Also read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!
సాధారణ రిజిస్ట్రేషన్లతో పాటు ఇమాం భూముల వ్యవహారాల్లో రూ.5,000 వరకు, అలాగే బ్యాంకు లోన్లు ఉన్న భూముల క్లియరెన్స్ (మ్యుటేషన్/లాగిన్ ప్రొసీడింగ్స్) కోసం రూ.3,000 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందా అంతా తనపైకి రాకుండా ఉండేందుకు స్థానిక ఆన్ లైన్ & మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి తీసుకవచ్చి వసూళ్లకు తెరలేపారు. రైతుల నుండి డబ్బులు వసూలు చేయకపోతే మీసేవ నిర్వాహకుల పనులను ఆపేస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక మీసేవ నిర్వాహకులే మధ్యవర్తులుగా మారి వసూళ్లు చేసి ఇస్తున్నారు.
అధికారుల వద్ద ఉన్న మంచి పేరుతో ఈ అవినీతిని నమ్మించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అందుకే, సదరు ఇన్చార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు మండలంలో జరిగిన ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నేరుగా ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. బాధితులైన రైతులను, ఆన్ లైన్ & మీసేవ నిర్వాహకులను అధికారుల సమక్షంలో కాకుండా, రహస్యంగా విచారిస్తేనే ఈ అక్రమ వసూళ్లకు సంబంధించిన పూర్తి నిజాలు, బయటకు వస్తాయని, అప్పుడే ఆమె అసలు రంగు బయటపడుతుందని స్థానికులు బలంగా చెప్తున్నారు.
Also read: గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!