Rythu Bharosa: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్) సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని రైతుల గుండెల్లో ‘లబ్ డబ్’మంటోంది. గతేడాది యాసంగి (రబీ) సీజన్లో లబ్ధిదారుల సంఖ్యపై భారీగా కోత విధించిన సర్కారు. కనీసం ఈ వానాకాలం (ఖరీఫ్) పంటకైనా పూర్తిస్థాయిలో మోక్షం కలిగిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. ‘రైతు భరోసా’ కింద ఎకరాకు ఇచ్చే పెట్టుబడి సాయంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం, విధివిధానాల జాప్యం రైతాంగాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు భరోసా ఇస్తుందా? లేక యాసంగి లాగే మొండిచేయి చూపుతుందా? అనేది రైతుల్లో చర్చకుదారితీసింది.
గడచిన 2025 యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 148 లక్షల ఎకరాల సాగు భూమి రైతు భరోసాకు అర్హత కలిగి ఉండగా.. ప్రభుత్వం కేవలం 94 లక్షల ఎకరాలకు మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. అది కూడా కేవలం రెండు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే అరకొరగా సాయం అందించి ‘మమ’ అనిపించింది. దీనివల్ల దాదాపు 54 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న రైతులకు రూపాయి కూడా పెట్టుబడి సాయం అందలేదు. పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్న రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది. ప్రభుత్వం మాత్రం ఈసారి రైతులందరికీ నిధులు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ రైతుల్లో మాత్రం సందేహం నెలకొంది. ఈసారి ఎవరెవరికి, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే దానిపై పల్లెల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారైనా తమకు పూర్తి స్థాయిలో సాయం అందుతుందో లేదోనని రైతులు ఒకరినొకరు ఆరా తీస్కుంటున్నారు. నిబంధనల పేరుతో ఈసారి కూడా కోతలు విధిస్తే పరిస్థితి ఏంటని గుబులు చెందుతున్నారు. గత ప్రభుత్వంలా అందరికీ ఇస్తారా?””లేక ఈసారి కూడా కేవలం 2 ఎకరాలు, 5 ఎకరాల పరిమితి విధిస్తారా?”అనేది కూడా మరోవైపు చర్చ పల్లెల్లో జోరుగా సాగుతోంది.
Also read: హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి
ఒకవైపు విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే గత యాసంగిలో 2 ఎకరాల వరకే భరోసా నిధులు జమచేసి మిగతా వారికి వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పులు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దశల వారీగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాలలో 2482.02 కోట్లు జమచేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రారంభించింది. అయితే మిగిలినవారికి ఎప్పటివరకు వేస్తారనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో రైతులు సాగు పనులు ప్రారంభించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా, సాగు చేసే ప్రతి ఎకరానికి సాయం అందించి ఆదుకోవాలని..ఖరీఫ్ సీజన్ ముగియక ముందే అర్హులైన రైతులందరికీ, ఎలాంటి ఎకరాల పరిమితి లేకుండా పూర్తిస్థాయిలో ‘రైతు భరోసా’ నిధులను జమ చేయాలని, తద్వారా రైతాంగాన్ని అప్పుల పాలు కాకుండా కాపాడాలని వ్యవసాయ రంగా నిపుణులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ ‘లబ్… డబ్’ గుబులును తీర్చి రైతులకు భరోసా ఇస్తుందో లేదో చూడాలి.
Also read: Mining Department: గనుల శాఖలో ఐటీ విభాగం జోరుగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు..!