Mega Leather Park: 2003లో అప్పటి ప్రభుత్వం స్టేషన్ ఘన్పూర్లో ఎంతో ఆర్భాటంగా లెదర్ పార్క్కు శంకుస్థాపన చేసింది. స్థానిక యువతకు ఉపాధి చూపిస్తామంటూ రెండు దశల్లో చెన్నైకి పంపి మరీ ట్రైనింగ్ ఇప్పించింది. బిల్డింగ్లు కట్టి, కోట్లు ఖర్చు చేసి మెషీన్లు కూడా తెచ్చారు. 2004లో యూనిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కానీ, ఆ సంతోషం రెండు నెలలు కూడా నిలవలేదు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ప్రొడక్షన్ ఆపేసి, యూనిట్కు తాళాలు వేశారు.
270 కోట్లతో నూతన డీపీఆర్ సిద్ధం చేసిన బీఆర్ఎస్
ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం, ప్రతి ఎన్నికల్లోనూ ఈ లెదర్ పార్క్ను ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది తప్ప.. పునరుద్ధరణకు కనీస చర్యలు తీసుకోలేదు. 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ పేరుతో 117 ఎకరాల్లో 270 కోట్లతో నూతన డీపీఆర్ సిద్ధం చేసింది. అందులో భాగంగా 105 కోట్ల ఆర్థిక సాయం అందించాలని, అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కానీ, ఇప్పటికీ ఆ ఫైలు కేంద్రం వద్ద పెండింగ్లోనే మూలుగుతోంది.
కేంద్రానికి డిమాండ్
తాజాగా వరంగల్ ఎంపీ కడియం కావ్య పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. స్టేషన్ ఘన్పూర్ మెగా లెదర్ పార్క్కు తక్షణమే అనుమతులు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంపీ చొరవతో మళ్లీ స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 117 ఎకరాల ప్రభుత్వ స్థలం, జాతీయ రహదారి, సరిపడా రైల్వే కనెక్టివిటీ.. ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యమే శాపంగా మారింది.
Also Read: నాగార్జున సాగర్ గడ్డపై వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న రేవంత్, ఉత్తమ్ దంపతులు!
ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడండి..
ఏళ్ల తరబడి కన్న కలలు కరిగిపోతున్నా, తుప్పు పడుతున్న యంత్రాలను చూస్తూ స్థానిక యువత నిట్టూరుస్తోంది. ఇప్పటికైనా నాయకులు కంటితుడుపు హామీలతో సరిపెట్టకుండా, కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించి మెగా లెదర్ పార్క్కు జీవం పోయాలని.. 25 వేల మంది యువతకు ఉపాధి మార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు.