KTR Supreme Court | ఫార్ములా ఈ కారు రేస్ కేసు (Formula E Car Case)కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఈ అత్యున్నత కోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న బి. వరాలే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో విచారణ చేయనుంది. ఇదే సమయంలో, కేటీఆర్ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేసింది.
సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్
కేటీఆర్ ఈ నెల 9న (గురువారం) సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను జనవరి 10న (శుక్రవారం) విచారణకు తీసుకోవాలని కేటీఆర్ న్యాయవాదులు కోరగా.. అందుకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా నిరాకరించారు. ఈ పిటిషన్ను జనవరి 15న విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అత్యవసరంగా సవాల్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టు… కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చింది. కేసులో మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.
Also Read: మహాకుంభమేళా వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి మృతి
ఫార్ములా కేసులో ఏసీబీ విచారణ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను ఏసీబీ (Anti-Corruption Bureau) విచారణ చేసింది. ఈ కేసులో భారీ ఆర్థిక లావాదేవీలు, నిధుల అక్రమంగా మళ్లించారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉండగా, ఏసీబీ ఆయనను విచారణకు హాజరు కావాలని సూచించింది. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన 40కు పైగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలనే అధికారులు పునరావృతం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
కేసులో ఆరోపణలు
ఈ కేసులో కేటీఆర్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఆయనపై ఉన్న ఆరోపణలను దర్యాప్తు చేశారు. ఇటీవల ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరించారు. ఈ విచారణలో ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. కేటీఆర్ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మాజీ అధికారులు అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన సమాచారంపై విచారణ జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు బదిలీ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.