Hyderabad: కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై వీహెచ్పీ నేతలు మండిపడ్డారు. ఏకంగా ఈ విషయాన్ని డీజీపీ సీవీ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన పోలీసులపై చర్చలు తీసుకోవాలని కోరారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసలేం జరిగింది?
పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్పీ నేతలు
హిందూ ధర్మాచార్యులు, సాధువుల పట్ల గద్వాల్-మల్దకల్ పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయారు విశ్వహిందూ పరిషత్-సాధు పరిషత్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని డీజీపీ సీవీ ఆనంద్తో ఆయా ప్రతినిధులు సమావేశమయ్యారు.
హిందూ ధర్మాచార్యులు, సాధువుల పట్ల పోలీసుల తీరును డీజీపీకి వివరించారు. ఆ తర్వాత వినతి పత్రం సమర్పించారు. శంకర్స్వామి పట్ల పోలీసుల అమర్యాదకర ప్రవర్తన హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అందులో ప్రస్తావించారు. గద్వాల్ ఎస్ఐ, మల్దకల్ ఎస్ఐలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. స్వామీజీని అవమానించే విధంగా పోలీసులు వ్యవహరించడం అత్యంత హేయమైన చర్యగా వర్ణించారు. సాధు సంతుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీసే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. విశ్వహిందూ పరిషత్ వినతి పత్రంపై డీజీపీ సీవీ ఆనంద్ రియాక్ట్ అయ్యారు.
ALSO READ: ఈసారీ ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య!
ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని డీజీపీ చెప్పినట్టు వీహెచ్పీ ప్రతినిధులు తెలిపారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. డీజీపీని కలిసిన వారిలో శంకర్ స్వామి, చాముండేశ్వరి స్వామి, వేదగిరి మహారాజ్, యోగేష్ ప్రభు, విశ్వహిందూ పరిషత్ గోరక్ష రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ ఉన్నారు.