Telangana RTC: ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వేగంగా వెళ్లేందుకు రోడ్లను నిర్మిస్తుంటే.. వాటిపై వేగంగా వెళ్తూ ఈ లోకాన్ని చాలామంది విడిచిపెట్టారు. దేశంలో ప్రతీ గంటకు 55 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు కేంద్రం రిపోర్టు చెబుతోంది. ప్రతీ నిమిషానికి ఒక యాక్సిడెంట్ అన్నమాట. ఆ ప్రమాదాల్లో 20 మంది చనిపోతుండగా, 50 మందికి పైగానే గాయపడుతున్నారు.
2022 రిపోర్టు కంటే 2023లో ప్రమాదాలు నాలుగు శాతం పైగానే పెరిగాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో దాదాపు 6 శాతం వరకు ప్రమాదాలు పెరిగినట్టు నివేదిక మాట. ప్రమాదాల వెనుక రకరకాల కారణాలు లేకపోలేదు. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు ఉన్నాయి.
పరిస్థితి గమనించిన తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు అలా చేయడం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వీటికి చెక్ పెట్టాలని ఆ సంస్థ డిసైడ్ అయ్యింది.
ALSO READ: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు
విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ శాఖ. సోమవారం నుంచి తెలంగాణ అంతటా ఈ విధానం అమల్లోకి రానుంది. 11 రీజియన్లలో ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. అక్కడి నుంచి వచ్చిన ఫలితాల తర్వాత దశల వారీగా అన్ని డిపోలకు వాటిని విస్తరించాలని ఆలోచన చేస్తోంది.
డ్రైవరు విధుల్లో చేరే ముందు తమ సెల్ఫోన్ను స్విచ్ఛాప్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి వద్ద డిపాజిట్ చేయాలి. విధులు ముగిసిన తర్వాత తిరిగి తీసుకోవాలి. ఒకవేళ అత్యవసర సమయంలో డ్రైవర్కు సమాచారం ఇవ్వాలంటే డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్ఫోన్ నెంబరు అందుబాటులో ఉంటుంది.
ఆ నెంబరుకు సమాచారమిస్తే సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా ఆయా బస్సు డ్రైవర్తో మాట్లాడిస్తారని చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టు కిందట ఈ కింద డిపోల్లో సోమవారం నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు రానున్నాయి. వాటిలో హైదరాబాద్-ఫరూక్నగర్, సికింద్రాబాద్-కూకట్పల్లి, మహబూబ్నగర్-కొల్లాపూర్, మెదక్-సంగారెడ్డి, నల్గొండ-మిర్యాలగూడ, రంగారెడ్డి-వికారాబాద్, ఆదిలాబాద్-ఉట్నూర్,కరీంనగర్-జగిత్యాల, ఖమ్మం-ఖమ్మం, నిజామాబాద్-కామారెడ్డి, వరంగల్-పరకాల డిపోల్లో అమల్లోకి రానుంది.