Ponnam Prabhakar: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోలిసులతో ఘర్షణ పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు అబద్దాలను ప్రచారం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికలలో ఓడిపోతున్నామన్న అసహనంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. అన్ని పేపర్లలోనూ మెుదటి బీజేపీ యాడ్స్ రూపంలో ఎన్నికల హామీలు ఇచ్చిందని చెప్పారు. వాటన్నింటినీ ఆ పార్టీ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పాలనను పట్టణ ఓటర్లు గుర్తించారని మంత్రి పొన్నం అన్నారు. ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో 80 శాతానికి పైగా మునిసిపాలిటీలు గెలవబోతున్నాం. తెలంగాణ కన్నుబడితే కొబ్బరి చెట్లు ఎండిపొతాయని మాట్లాడినవారితో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇచ్చిన హమీలు నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీదే. కాబోయే ఛైర్మన్లు బీజేపీ ప్రకటన గురించి పోరాడుతారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక బీజేపీ నేతలదే’ అని పొన్నం చెప్పుకొచ్చారు.
కాగా, మున్సిపల్ పోలింగ్ సందర్భంగా హుస్నాబాద్ లోని నవ భారత్ హైస్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్య హక్కుకు నిదర్శనమని పేర్కొన్నారు.