New EHS: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ అమలుకు మరిoత ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులన్నీ న్యూ ఈహెచ్ఎస్ పథకానికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు, పింఛనుదారులకు తక్షణమే నగదు రహిత చికిత్స (క్యాష్లెస్ ట్రీట్మెంట్) అందించేందుకు అంగీకారం తెలిపాయి.
ఈ మేరకు శనివారం సచివాలయంలో ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ, బోర్డు కన్వీనర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజీ-జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్తో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు, టీఎస్హెచ్ఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అపోలో, యశోద, కిమ్స్, కాంటినెంటల్ తదితర ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం అమలు తీరు, ఆసుపత్రుల సహకారంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. చర్చల అనంతరం ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి, తక్షణమే పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చాయని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: బిగ్ బాస్ 10లోకి శర్వానంద్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!
దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన చికిత్స అందించాలని ఎంపానెల్డ్ ఆసుపత్రులకు ఈహెచ్సీటీ విజ్ఞప్తి చేసింది. పథకం విజయవంతానికి మార్గదర్శనం చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శిలకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు గిరి శ్రీనివాస్ రెడ్డి, సదానందం గౌడ్, ఏ. వెంకటి, ప్రేమ్, శ్యామ్ తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also read: మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !