Rythu Bharosa: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగు భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వబోతుంది. యాసంగిలో సాగు చేయని భూములకు ఇస్తారా? ఇవ్వరా? అనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికి ఇవ్వబోతుంది. ఇప్పటికే అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శాటిలైట్ ఆధారిత పంటల విస్తీర్ణం లెక్కింపుపై ప్రభుత్వానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ఎలాంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా రైతు భరోసా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడిసాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరా గా ఉంటుందని భావిస్తున్నారు.అందుకోసం ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తుంది. యాసంగి సీజన్కు సంబంధించి ఒకే విడతలో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేసేందుకు వేగవంతం చేసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందజేశారు. ఈ యాసంగిలోనూ వానాకాలంలో సాగైన భూములకు భరోసా అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే యాసంగిలో పత్తి, మిర్చి తో పాటు ఇతర వాణిజ్య పంటలు సాగు చేయని భూములకు భరోసా ఇస్తారా? లేదా? అనే సందేహం రైతుల్లో ఉండేది. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం రైతులందరికీ సాగు చేస్తున్న భూములకు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Alien Existence: ఏలియన్స్ భూమి మీద ఎంట్రీ ఇస్తే.. జరగబోయేది ఇదేనా!
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారిగా పంటల విస్తీర్ణాన్ని స్విట్జర్ ల్యాండ్ లోని శాటిలైట్ చిత్రాల విశ్లేష సంస్థ ‘సర్ మ్యాప్’(ఎస్ఏఆర్ ఎంఏపీ)తో ఒప్పందం చేసుకొని ప్రారంభించింది.రెవెన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది. అందుకు సంబంధించిన అన్ని జిల్లాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిననివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. పంటల బీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హత గల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడనుంది.
అయితే గత ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా పంటలనమోదు చేసినట్లు సమాచారం. వానాకాలంలో 2.50లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలు తగ్గింది. అయితే పంటల విస్తీర్ణం ఎందుకు తగ్గిందనే దానిపై యూనివర్సిటీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఆ భూములు సాగు చేయకుండా కమర్షియల్ గా వినియోగిస్తున్నారని అందుకే అధికారులు ఆ భూములను భరోసా పథకం నుంచి తొలగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమకాబోతున్నాయని, అందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఏది ఏమైనా రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించబోతుంది.
Also Read: MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి