Weather News: ఆగస్టు నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఆగస్టు రెండో వారంలో మొదలైన వర్షాలు.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ చివరి వారంలో కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తాజా గత రెండు రోజుల నుంచి మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్టేట్ ఇచ్చారు. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ, గద్వాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం..
రాబోయే రెండు గంటల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు వివరించారు. హైదరాబాద్ లో ఇవాళ రాత్రంతా మోస్తారు నుంచి తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ALSO READ: Health Tips: మీరు తగినంత నిద్ర పోవడం లేదని తెలిపే.. సంకేతాలివే !
సాయంత్రం వేళ బయటకు వెళ్లొద్దు..
భారీ వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న పలు చోట్ల పిడుగు పడి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు.
ALSO READ: Blood Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అస్సలు లైట్ తీసుకోవద్దు, బ్లడ్ క్యాన్సర్ కావొచ్చు