Toxic Event: స్వేచ్ఛ బ్యూరో: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చిన సమయంలో సౌండ్ స్పీకర్లు విద్యార్థులపై పడటంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. రాజ్కుమార్ (20)కు చేయి, కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి.
ఈవెంట్కు అనుమతించిన పరిమితికి మించి ప్రేక్షకులను ప్రాంగణంలోకి అనుమతించడంతో అధిక జనసందోహం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. సౌండ్ స్పీకర్లు ఏర్పాటు చేసిన స్టాండ్లపై విద్యార్థులు ఎక్కడంతో అవి అదుపుతప్పి కిందపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also read: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!
కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఓ విధుల్లో ఉన్న అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అనుమతించిన పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉన్నప్పటికీ నిర్వాహకులు అదనపు జనాన్ని అనుమతించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అధికారుల అనుమతించిన సమయ పరిమితిని మించి కార్యక్రమాన్ని కొనసాగించినట్లు ఆరోపించారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులైన శ్రేయాస్ మీడియా, మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read: అంజయ్య నగర్ ప్రమాదంలో బయటపడ్డ సంచలనాలు.. బిల్డర్ సాజిద్ అక్రమాల చిట్టా రట్టు!