Trainee IPS Case: స్వేచ్ఛ బ్యూరో: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై కోర్టుకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనను బెదిరించటంతోపాటు ఎన్ కౌంటర్ చేస్తానని భయపెట్టినట్టు అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దర్యాప్తు అధికారులపై అసహనం..
దాంట్లో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పాడటంతోపాటు చంపేస్తానని బెదిరించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కేసులు నమోదు కాగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఆయనను గురువారం కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. అయితే, రెండు రోజులపాటు జరిపిన విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తనకు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డానన్నది నిజం కాదని అన్నట్టు తెలిసింది. ఓ దశలో నన్నెందుకు వేధిస్తున్నారు.. నాతో ఏం చెప్పించాలనుకుంటున్నారు అని దర్యాప్తు అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
కోర్టులో సంచలన ఆరోపణలు..
ఇక, కస్టడీ గడువు ముగియటంతో శుక్రవారం సాయంత్రం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ కు లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. విచారణ సమయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తనను తీవ్రంగా బెదిరించారని.. ఓ దశలో ఎన్ కౌంటర్ చేస్తానని భయపెట్టారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు లేని చోట నన్ను ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకెళ్లి హింసించారని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారు? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని అత్తాపూర్ సీఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read: జంతర్ మంతర్ను మూసివేయండి.. కేంద్రానికి హైకోర్టు కీలక సూచన!