Bridge Collapsed in Telangana : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. భారీ ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.. సోమ, మంగళవారం మధ్యరాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ.49 కోట్ల బడ్జెట్ లో కిలోమీటరు పొడవున వంతెనను నిర్మించేందుకు 2016లో శంకుస్థాపన చేసింది నాటి ప్రభుత్వం. రెండు జిల్లాల మధ్య రవాణాను మరింత సులభం చేసేందుకు నిర్మించతలపెట్టిన ఈ వంతెనకు శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.
Also Read : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి.. షాకింగ్ వీడియో!
ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఏదేమైన జనసంచారం ఎక్కువగా ఉండని మధ్యరాత్రి వేళ వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే.. ఏమయ్యుండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.