Land Encroachment: కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బొమ్మకల్ వద్ద ఓ ఒంటరి మహిళకు చెందిన విలువైన భూమిని ఆక్రమించి, బెదిరింపులకు దిగుతున్న చల్మేడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్, బిఆర్ఎస్ నాయకుడు చల్మేడ లక్ష్మీనరసింహారావుపై ప్రభుత్వం, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన కాసర్ల మంజుల భర్త సింగరేణి ఉద్యోగం చేస్తూ మరణించగా, ఆయన ద్వారా వచ్చిన డబ్బులతో పిల్లల భవిష్యత్తు కోసం బొమ్మకల్ సర్వే నంబర్ 127/C/1/1, 127/C/1/2/2 పరిధిలో 30 గుంటల (0-30 గుంటలు) వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. పక్కనే తన విద్యాసంస్థను విస్తరించే క్రమంలో చల్మేడ లక్ష్మీనరసింహారావు కన్ను ఈ భూమిపై పడింది. రాత్రికి రాత్రే అందులోని చెట్లను కూల్చివేసి, హద్దురాళ్లను తొలగించి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. దీనిపై బాధితురాలు కరీంనగర్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు (I.A. No. 216 of 2026 in O.S. No. 554 of 2026) జారీ అయ్యాయి. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా చల్మేడ యాజమాన్యం అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తుండటం చట్టాన్ని తీవ్రంగా అవమానించడమేనని హరిప్రసాద్ మండిపడ్డారు.
Also Read: పవన్ ఓవరాక్షన్- బీజేపీకి రియాక్షన్.. పొత్తు వద్దే వద్దని నిర్ణయం..!
బాధిత మహిళను తన కార్యాలయానికి పిలిపించుకుని, ఫోన్లను లాక్కుని, “నేను రాజకీయ నాయకుడిని.. మళ్లీ ఈ స్థలంలోకి వస్తే లేకుండా చేస్తా” అని బెదిరింపులకు దిగడం చల్మేడ గుండాగిరి వైఖరికి అద్దం పడుతోందన్నారు. బాధితురాలు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు మౌనంగా ఉండటం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు.
రాజకీయ ముసుగులో వైట్ కాలర్ నేరస్థుడిగా మారీ, అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న లక్ష్మీనరసింహారావును బిఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. కరీంనగర్ పోలీసులు కబ్జాకోరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుందని, అదే రీతిలో చల్మేడపై కేసు నమోదు చేసి బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. ప్రజావాణి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని, లేనిపక్షంలో బాధిత మహిళ తరఫున తెలంగాణ రక్షణ సేన క్షేత్రస్థాయిలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హరిప్రసాద్ హెచ్చరించారు.
Also Read: రీల్స్ చూస్తున్నారా..? అయితే ఇది ఒక్కసారి చదవండి