V Hanumantha Rao: గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయని, వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
కేంద్రం కుట్రలు.. బిసిల హక్కుల పరిరక్షణ
దేశంలో దాదాపు 60 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని హనుమంతరావు ఆరోపించారు. ఈ కుట్రల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని ధర్నాలు చేయడం దారుణమని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
రాహుల్ గాంధీ ఆలోచనలు.. కులగణన ప్రాధాన్యత
దేశంలో రిజర్వేషన్ల సమర్థ అమలుకు రాహుల్ గాంధీ గళమెత్తడంతోనే బీజేపీ బెంబేలెత్తుతోందని విహెచ్ పేర్కొన్నారు. గతంలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా తాము ఎలాంటి అడ్డుచెప్పలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ కూడా రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు జరిగిందని, ఇక్కడి ముఖ్యమంత్రి బిసిల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.
సోమవారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా
కేంద్ర వైఖరికి నిరసనగా, బిసి హక్కుల సాధన కోసం రాబోయే సోమవారం నాడు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విహెచ్ ప్రకటించారు. కులాల పక్షాన పోరాడేందుకు పార్టీలకతీతంగా నాయకులందరూ ఈ ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు సీఎం అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం దారుణమని, అభివృద్ధికి అడ్డుపడే విధానాలను మానుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: చంద్రుడి సీక్రెట్ గుహల్లోకి దూకే విచిత్ర రోబో! చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి?