Vanguard Company: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అగ్ర కంపెనీలు ముందుకు రాగా.. మరో ప్రముఖ కంపెనీ వాన్ గార్డ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తొలి కార్యాలయం హైదరాబాద్ లోనే స్థాపించనున్నట్టు వ్యాన గార్డ్ సంస్థ సీఈవో సలీమ్ రామ్ జీ ప్రకటించారు. దీంతో ఈ కార్యాలయంలో భారీగా ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.
2300 మందికి ఉద్యోగ అవకాశాలు..
హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ కేపబులిటీ సెంటర్ లో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో వాన్ గార్డ్ కంపెనీ సీఈవో సలీమ్ రామ్ జీ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఐఓ ఐటీ విభాగం ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ వాన్ గార్డ్ ఇండియా ప్రిన్సిపాల్ హెడ్ వెంకటేశ్ నటరాజన్, సీఎస్ శాంతికుమారి తదితరులు ఉన్నారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారితో పెట్టుబడుల అంశంపై చర్చించారు.
హైదరాబాద్ మహా నగరాన్ని కేపబులిటీ సెంటర్ల హబ్ గా చేస్తాం: సీఎం
హైదరాబాద్ మహా నగరాన్ని కేపబులిటీ సెంటర్ల హబ్ గా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాన్ గార్డ్ సంస్థ భాగ్యనగరంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడానికి స్వాగతం చెబుతున్నట్టు సీఎం చెప్పారు. వాన్ గార్డ్ సంస్థ వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లభించడం ఆనందంగా ఉందన్నారు. వాన్గార్డ్తో హైదరాబాద్ స్థాయి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. రైజింగ్ దృక్పథంలో చేరడానికి తాను హ్యాపీగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ రైజింగ్ లో భాగంగా.. తాము హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా జీసీసీ కేంద్రంగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వాన్ గార్డ్ ఆమోదం తమ ప్రపంచ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అందుకోసమే హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు: సలీం రామ్ జీ
కార్యక్రమంలో వాన్ గార్డ్ సీఈవో సలీం రామ్ జీ కూడా మాట్లాడారు. ప్రభుత్వం సానుకూల విధానాల వల్లే తమ సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్ మహా నగరంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని సలీం రామ్ జీ చెప్పారు. హైదరాబాద్ నగరంలో అన్ని రకాల నిపుణులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి ఇంజనీర్లను వెంటనే నియమించుకోవాలని చూస్తున్నామని వాన్ గార్డ్ సీఈవో సలీం రామ్ జీ తెలిపారు.
ALSO READ: IIIT Student Suicide: అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ స్టూడెంట్ సూసైడ్.. కారణం ఏంటంటే..?
ALSO READ: Weather News: రెండు తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. ఇక వర్షాలే వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన