Boiler Explosion: వరంగల్ టెక్స్టైల్ పార్క్లోని ‘గణేశ ఏకోటెక్’ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగారంలో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా బాయిలర్ పేలిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
క్షణాల్లో మారిన వాతావరణం
వాడిన PET బాటిళ్లను రీసైకిల్ చేస్తూ పోలియేస్టర్ నూలును తయారుచేసే ఈ పరిశ్రమ, వరంగల్ టెక్స్టైల్ పార్క్లోనే అత్యంత పెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా నిలిచింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్లో దాదాపు 1000 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. సడన్గా పెను శబ్దంతో బాయిలర్ పేలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాంగణమంతా పొగలు అలుముకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్మికులు తీవ్ర భయాందోళనల మధ్య బయటకు పరుగులు తీశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఇంజన్లు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు, భద్రతా ప్రమాణాల పాటించడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: టీచర్లకు బిగ్ షాక్.. అనుమతి లేకుండా ‘డుమ్మా’ కొడితే ఉద్యోగం పోయినట్లే!