
YS Sharmila : పోలీసులపై దాడి కేసులో అరెస్టైన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. పోలీసులపై దాడి కేసులో సోమవారం షర్మిలను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి షర్మిల విడుదల కానున్నారు. నాంపల్లి కోర్టు షర్మిలకు కొన్ని షరతులు విధించింది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
షర్మిల బెయిల్ పిటిషన్ వాదనలు సాగిందిలా..
షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు నిబంధనలను సైతం పాటించడం లేదన్నారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అంతకు ముందు చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
షర్మిల పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు వైఎస్ షర్మిలను ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకెళ్లి కలిశారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే.. షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. బయటకు వెళ్లే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా అని ప్రశ్నించారు. షర్మిల క్రిమినలా.? టెర్రరిస్టా..? అని విజయమ్మ నిలదీశారు. ప్రజల కోసమే పోరాడుతుందన్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం మొదలు పెట్టిందే షర్మిల అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సభలకు పర్మిషన్ ఇస్తున్నారు కానీ షర్మిలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె భయపడదని విజయమ్మ స్పష్టం చేశారు.
Kavitha: ప్రశ్నిస్తే దాడులా? దేశాన్ని ఏకం చేస్తాం.. బీజేపీకి కవిత వార్నింగ్