Mangrove Forests In India: అద్భుతమైన పచ్చదనంతో, నిర్మలమైన అందంతో మడ అడవులు అడ్వెంచరస్ అనుభూతిని కల్పిస్తాయి. భూమి, సముద్రం ఒకదానితో ఒకటి కలిసిపోతూ, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను కాపాడ్డంతో పాటు నేచర్ లవర్స్ ను ఆకట్టుకుంటాయి. తూర్పున విశాలమైన సుందర్ బన్స్ నుంచి పశ్చిమాన గోవాలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ వరకు, దేశంలోని మడ అడవులు జీవవైవిధ్యం, సహజ వైభవంతో ఆకట్టుకుంటున్నాయి.
దేశంలో అద్భుతమైన మడ అడవులు
దేశంలో మడ అడవులు తీర ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవులు పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. దేశంలోని అద్భుతమైన మడ అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ సుందర్ బన్స్, బెంగాల్
సుందర్ బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు. ఇవి భారత్, బంగ్లాదేశ్ నడుమ సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఇక్కడికి వెళ్తే రాయల్ బెంగాల్ టైగర్ ను కూడా చూసే అవకాశం ఉంది.
⦿ భితార్కనికా మడ అడవులు, ఒడిశా
మహానది డెల్టా ప్రాంతంలో ఉన్న భితార్కనికా జాతీయ ఉద్యానవనం అతిపెద్ద మడ అడవులను కలిగి ఉంది. ఈ ప్రాంతం ఉప్పునీటి మొసళ్ళు, భారతీయ కొండ చిలువలు, కింగ్ కోబ్రాలకు నిలయంగా ఉంది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు నిలయంగా ఉంది.
⦿ పిచావరం మడ అడవులు, తమిళనాడు
చిదంబరం సమీపంలో ఉన్న పిచావరం మడ అడవులు వెల్లార్, కొల్లిడం నదీముఖ ద్వారాల మధ్య దాదాపు 1,100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రశాంతమైన ప్రకృతి అందాల నడుమ పడవ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చదనం, విభిన్న పక్షులు కనువిందు చేస్తాయి.
⦿కొరింగ వన్యప్రాణుల అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్
గోదావరి డెల్టాలో ఉన్న కొరింగ దేశంలో మూడవ అతిపెద్ద మడ అడవులు. ఈ అభయారణ్యంలో 24 జాతుల మడ చెట్లను కలిగి ఉంది. ఇక్కడ అనేక జాతుల పక్షులను కూడా చూడవచ్చు. ఈ అడవుల్లో పడవ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
⦿ గోదావరి-కృష్ణ మడ అడవులు: ఆంధ్రప్రదేశ్
గోదావరి, కృష్ణ నదుల డెల్టాలలో సుమారు 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తుఫానుల నుండి తీరప్రాంత రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అనేక రకాల వన్యప్రాణులకు జీవనాధారంగా కొనసాగుతున్నాయి.
Read Also:జపాన్ వెళ్లేందుకు జంకుతున్న జనం.. ఆ కామిక్ బుక్ లో చెప్పిందే జరుగుతుందా?
మడ అడవులను ఎందుకు చూడాలి?
మడ అడవులు భూమిపై మనోహరమైన, సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థల కలబోతగా ఉన్నాయి. చేపలు, క్రస్టేసియన్లు, మొలస్క్లు, పక్షులు సహా అనేక జాతులకు ఆవాసాలుగా ఉన్నాయి. ప్రశాంతమైన జలమార్గాల ద్వారా పడవ ప్రయాణాలు, పక్షులను చూడటం, ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలాన్ని అన్వేషించడం ప్రకృతి ఔత్సాహికులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీలుంటే, మీరు కూడా ఒక్కసారైనా ఈ మడ అడవులను సందర్శించండి.
Read Also:ప్రపంచంలో క్లీనెస్ట్ ఎయిర్ పోర్టులు ఇవే, చిన్న చిత్తు కాగితం కూడా కనిపించదు!