Kharagpur to Amaravati High-Speed Road Corridor: ఆంధ్రప్రదేశ్ లో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్పూర్ నుంచి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ భారీ హైస్పీడ్ రోడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్ కు కొత్త అవకాశాలను తీసుకురానుంది. ఈ భారీప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.75,000 కోట్లు. ఇందులో ఏకంగా 457 కిలోమీటర్ల రహదారి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనుంది. దీంతో రాష్ట్రంలోని గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ హైస్పీడ్ కారిడార్ అరకు, పాడేరు, చింతపల్లి వంటి ముఖ్యమైన ఏజెన్సీ ప్రాంతాల గుండా వెళ్లనుంది. అనంతరం గోకవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల, నూజివీడు ప్రాంతాలను కలుపుతూ ముందుకు సాగనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు చేరుకోవడానికి కొన్నిచోట్ల ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల కారణంగా రవాణా కొంత కష్టంగా ఉంటుంది. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతాలకు వెళ్లే మార్గం మరింత సులభతరం కానుంది.
అరకు, పాడేరు, చింతపల్లి లాంటి ప్రాంతాలు ఇప్పటికే ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే, రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొత్త హైస్పీడ్ కారిడార్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఈ ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. దీంతో స్థానిక హోటళ్లు, హోమ్ స్టేలు, చిన్న వ్యాపారాలు, పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రయోజనం కలగవచ్చని భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరుకు రవాణా రంగానికి కూడా ఉపయోగపడనుంది. ప్రస్తుతం తూర్పు తీరంలో అత్యంత రద్దీగా ఉండే కోల్కతా-చెన్నై జాతీయ రహదారి NH-16కు ఈ కొత్త మార్గం ప్రత్యామ్నాయం కానుంది. కొత్త హైస్పీడ్ రహదారి ద్వారా సరుకులను వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణాకు ఉపయోగపడనుంది.
రహదారి కనెక్టివిటీ పెరగడం వల్ల పరిశ్రమలు, వ్యాపార రంగం, పర్యాటకం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటివరకు రవాణా పరంగా కొంత వెనుకబడిన ప్రాంతాలకు కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్టు అమలులో భూసేకరణ, అటవీ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల గుండా రహదారి వెళ్తున్నందున స్థానిక ప్రజల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
Read Also: 100 కి.మీ నిర్మాణం పూర్తి.. బుల్లెట్ రైలు కల సాకారం దిశగా కీలక ముందడుగు!