History Of China’s Gyirong Port and Flood Details: చైనా – నేపాల్ సరిహద్దులో ఏర్పడిన రాకాసి వరద.. భారీ ఆస్తి నష్టమే కాదు, వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 469 మంది చనిపోయినట్లు తెలిసింది. అయితే, ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో 170 మంది భారతీయులు కూడా ఉన్నారు. వరద బీభత్సవానికి.. తీర ప్రాంతాల్లోని ఎన్నో ఇళ్లు ప్రవాహంలో కలిసిపోయాయి. కాంక్రీట్ మిక్సర్ను తలపించే రాళ్లతో కూడిన బురద విరుచుకుపడటం వల్ల పెద్ద పెద్ద భవనాలు సైతం కూలిపోయాయి.
చివరికి చైనా సరిహద్దులో ఉన్న జిరాంగ్ పోర్ట్ భవనం సైతం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. అసలు ఒకప్పుడు అక్కడ భవనం ఉండేదా అనే సందేహం కలిగేలా.. ఆ ప్రాంతంలో చిన్న శిథిలం కూడా మిగల్లేదు. భవనాల పరిస్థితితే ఇలా ఉంటే.. అందులో ఉన్న జనాలు, సిబ్బంది ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కొని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. నేపాల్ సరిహద్దులో ఉన్న రసువా కస్టమస్స్ ఆఫీస్ భవనం పరిస్థితి కూడా అంతే. చిత్రంలో చూపించినట్లు రెండు భవనాలు, పరిసర ప్రాంతాలను మొత్తం వరద తుడిచిపెట్టేసింది.
గ్లాసియర్ కూలిన ప్రాంతంలోని హిమాలయ పర్వతం సుమారు 5,200 మీటర్ల (17 వేల అడుగులు) ఎత్తులో ఉంది. ఇది చైనా-నేపాల్ సరిహద్దులో నేపాల్ భూభాగంలోని లాంగ్టాంగ్ జాతీయ పార్క్ పరిధిలోని లేండే ఖోలా నది, భోటే కోషి నదులు పుట్టే ప్రాంతానికి సమీపంలో ఉంది. సుమారు 8.37 గంటల సమయంలో అక్కడ సగం గ్లాసియర్ నదిలోకి కూలింది. అయితే, అక్కడి కొండచరియలు, బండరాళ్లు నది ప్రవాహాన్ని అడ్డుకుని తాత్కాలిక సహజ సిద్ధమైన డ్యామ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున నీరు, రాళ్లు, మంచు అందులో నిండిపోయింది. 10.15 గంటల సమయంలో మిగతా సగం గ్లాసియర్ కూడా 1.2 కిమీల ఎత్తు నుంచి ఆ డ్యామ్లో పడింది. దానివల్ల ఆ దిబ్బ ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ఆ పర్వతం మీద నుంచి నిట్టనిలువగా నీరు నదిలోకి దూకింది. కొండ చరియాలు విరిగి.. రాళ్లు, నీళ్లు కలిసిన బురద ప్రవాహం.. వేగంగా ఉరకలెత్తడం ప్రారంభించింది. మంచు రాళ్లు (గ్లాసియర్స్) కూలిన సమయంలో రిక్టార్ స్కేలు మీద 4.4 తీవ్రతతో సమానమైన ప్రకంపనలు నమోదయ్యాయి అంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి జిరాంగ్ పోర్ట్ ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ సుమారు 20 కిమీల దూరంలో ఉంది.
డ్యామ్ విస్ఫోటనం తర్వాత ఏర్పడిన బురద ప్రవాహం సునామీ తరహాలో ఎత్తైన కెరటాలతో నదిలో ప్రవహించింది. ఆ దిబ్బ పేలిన సుమారు 5 నుంచి10 నిమిషాల వ్యవధిలోనే ఆ నీరు నేరుగా జిరాంగ్ పోర్ట్, రసువా కస్టమస్స్ ఆఫీస్ భవనాలకు చేరుకుంది. కొండల పైనుంచి మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు, మంచు కలిసి ఏర్పడిన భారీ ప్రవాహం.. ఒక్కసారి సుమారు 30 అడుగుల ఎత్తుతో ఆ భవనాలపైకి దూకింది. (30 అడుగుల ఎత్తు.. సుమారు 3 అంతస్తుల భవనంతో సమానం). దీంతో జిరాంగ్ పోర్ట్ భవనం మొత్తం రెప్పపాటులో మాయమైపోయింది. ఆ సమయంలో సిబ్బంది ఆ భవనంలోనే ఉన్నారు. వారికి తప్పించుకొనే టైమ్ కూడా దొరకలేదు. అధికారులు, జనాలు ఈ ప్రమాదాన్ని గుర్తించే లోపే ప్రళయం ముంచేసింది. అక్కడ పార్క్ చేసిన పెద్ద పెద్ద బస్సులు సైతం పిల్లలు ఆడుకొనే బొమ్మలా కనిపించాయి. జిరాంగ్ చెక్ పోస్ట్ను ముంచెత్తిన తర్వాత ఆ నీరు సుమారు 170 కిమీల మేర దిగువకు ప్రవహిస్తూ.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది.
అంత పెద్ద భవనం ఆనవాళ్లు లేకుండా పోవడం నిజంగా ఆశ్చర్యకరమే. చైనా ఏరియల్ డ్రోన్లు, శాటిలైట్ ఫోటోలను పరిశీలిస్తే.. అక్కడ జిరాంగ్ ఇమిగ్రేషన్ భవనం ఉండేదనే సంకేతాలు తెలియడం లేదు. ఆ భవనం కాంక్రీటు పిల్లర్ల నుంచి పార్కింగ్ చేసిన వాహనాలు, సువిశాల ఆఫీసు నిర్మాణాలను ఆ వరద పునాదులతో పెకిలించేసింది. ఆ భవనాలను తనలో కలిపేసుకుంది. వరదకు ముందు, తర్వాత ఆ భవన పరిస్థితులను ఈ ట్వీట్లో చూడవచ్చు.
🇨🇳🇳🇵🌊 FLASH | La frontière entre la Chine et le Népal a été DÉVASTÉE par le gigantesque torrent de boue mortel.
De nouvelles images satellites montrent que le poste-frontière de Rasuwagadhi a été entièrement détruit, tandis que la puissance des eaux a littéralement ravagé le… https://t.co/iB1KMlC4xQ
— Cerfia (@CerfiaFR) August 28, 2026
జిరాంగ్ పోర్ట్.. వద్ద భయానక పరిస్థితిని చూసిన తర్వాత చాలామందిలో మెదిలిన ప్రశ్న.. ఆ భవనాన్ని అక్కడే ఎందుకు కట్టారని. ఈ ప్రాంతం.. చైనా, నేపాల్కు ప్రధాన ద్వారం లాంటిది. చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న షిగాట్టే పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. చైనా, నేపాల్ మధ్య సరుకుల రవాణా, యాత్రికుల రాకపోకలకు ఇదే కీలక మార్గం. 2015లో ఏర్పడిన ఘోర భూకంపం వల్ల పాత తాటోపాని సరిహద్దు మూతపడింది. దీంతో చైనా ప్రభుత్వం జిరాంగ్ పోర్ట్ను భారీ బడ్జెట్తో ఆధునికీకరించింది. ఆ తర్వాత 2017లో దాన్ని అంతర్జాతీయ సరిహద్దు ఆఫీసుగా మార్చింది. ఈ భవనంలో చైనా బోర్డర్ కంట్రోల్, ఇమిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ కాంప్లెక్స్ భవనాలు ఉండేవి. వే బ్రిడ్జ్, కస్టమ్స్ క్లియరెన్స్, పాస్ పోర్ట్ వెరిఫికేసన్ టెర్మినల్స్, పర్యాటకుల కోసం వెయిటింగ్ హాళ్లు.. ఇలా చాలా సదుపాయాలు ఈ భవనంలో ఉన్నాయి.
ఈ ఏడాది జూన్ నాటికి సుమారు పది లక్షల మంది ఇక్కడ సరిహద్దు దాటారు. వారిలో ఎక్కువ మంది మానస సరోవర్ యాత్రికులే ఉన్నారు. వారితోపాటు వ్యాపారులు, సరుకు రవాణా డ్రైవర్లు నిత్యం ఈ మార్గం మీదుగా నేపాల్ – చైనా మధ్య రాకపోకలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ సరిహద్దు ద్వారా రోజూ 1500 నుంచి 2000 మంది వరకు రాకపోకలు చేస్తుంటారు. మే నుంచి సెప్టెంబరు వరకు మానసరోవర యాత్రికులు ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో రోజుకు 3 వేలమందికి పైగా రాకపోకలు చేస్తారు. రోజూ సుమారు 200 నుంచి 400 లారీలు, ట్రక్కులు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఆగుతాయి.
Also Read: శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?
వరద ముంచెత్తిన రోజు (ఆగస్టు 26న) ఆ ప్రాంతంలో సుమారు 1500 నుంచి 2000 మంది వరకు ఉన్నారని అంచనా. వారితోపాటు భవనంలో సుమారు 100 నుంచి 150 మంది వరకు సిబ్బంది ఉన్నారు. అటువైపు నేపాల్ కస్టమ్ ఆఫీసు పరిసరాల్లో సుమారు 500 మంది, 50కి పైగా సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. చైనా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. జిరాంగ్ కౌంటీ పరిధిలో 558 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో భవనం లోపల ఇండియాకు చెందిన 77 మంది ఈశా యాత్రికులు ఉన్నారని, వారంతా గల్లంతైనవారిలో ఉన్నారు. చైనా ప్రభుత్వం ప్రస్తుతం మిలట్రీ, రెస్క్యూ బృందాలు, డ్రోన్లు, లైఫ్ డిటెక్టర్లతో గాలింపు చర్యలు చేపట్టింది.
Also Read: అమ్మో.. దేశంలో ఒక్క బిడ్డను పెంచడానికి రూ.6.75 కోట్లా? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే!