Indian Railways: హైదరాబాద్ లో రైల్వే సామర్థ్య రోజు రోజుకు మరింత పెరుగుతుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ ప్రాంతంలో రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ను అధిక సామర్థ్యం గల లాజిస్టిక్స్, కనెక్టివిటీ హబ్ గా మార్చాలనే భారత రైల్వే విస్తృత దృక్పథంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
600 నుంచి 1200 రైళ్లకు పెంపు
తాజాగా హైదరాబాద్ లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం రోజుకు సుమారు 600 రైళ్లు నడుస్తున్నాయని, ప్రస్తుత కార్యాచరణ సామర్థ్యాన్ని మరికొద్ది సంవత్సరాల్లో రోజుకు 1,200 రైళ్లకు పెంచుతామన్నారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకునే బాధ్యతలను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు కేటాయించినట్లు తెలిపారు. “సికింద్రాబాద్ సమీప స్టేషన్లతో సహా మొత్తం హైదరాబాద్ ప్రాంతం సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి కూడా ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ పనులు పూర్తవుతున్నాయి” అని వైష్ణవ్ తెలిపారు.
కొత్త రైల్వే హబ్లు, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్
తెలంగాణలో రైల్వే హబ్-ఆధారిత కార్యాచరణ మోడల్ ను కూడా అన్వేషిస్తున్నట్లు రైల్వే మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని స్టేషన్లు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో అవుట్ బౌండ్ కనెక్టివిటీకి కీలకమైన నోడ్ లుగా పని చేయడానికి కాన్ఫిగర్ చేయబడతాయన్నారు. ఈ మోడల్ రైల్వే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రధాన టెర్మినల్స్ లో రద్దీని తగ్గిస్తుందన్నారు.
ప్రతిష్టాత్మకంగా రైల్వే రింగ్ రోడ్
తెలంగాణ భవిష్యత్ రవాణా బ్లూప్రింట్ లో ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) వ్యూహాత్మక పాత్రను వైష్ణవ్ నొక్కిచెప్పారు. రైల్వే కనెక్టివిటీని సులభతరం చేయడానికి, ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపోలను (ICDలు) స్థాపించడానికి RRR పక్కన 30 మీటర్ల కారిడార్ ను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్లు ఆయన వెల్లడించారు. “ఈ ICDలు తెలంగాణ తయారీ జోన్ల నుంచి దేశం అంతటా కీలకమైన ఓడరేవులకు సజావుగా వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి” అని వైష్ణవ్ తెలిపారు. ఇది రాష్ట్ర లాజిస్టిక్స్, ఎగుమతికి గేమ్ ఛేంజర్ కాబోతోందన్నారు.
Interaction with the field officials on doubling the capacity of railway projects in Hyderabad region. pic.twitter.com/BPqAsXp5aG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2025
సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ కు మద్దతు
భారత సెమీకండక్టర్ మిషన్ లో క్రియాశీలంగా పాల్గొంటున్న IIT హైదరాబాద్ ను మంత్రి వైష్ణవ్ ప్రశంసించారు. సెమీకండక్టర్ డిజైన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి IIT హైదరాబాద్ ముందుకు రావడం మంచి విషయంవ అన్నారు. “సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ లో నెక్ట్స్ జెనరేషన్ స్కిల్స్ తో యువతను శక్తివంతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు ఈ చొరవ అనుగుణంగా ఉంది” అని వైష్ణవ్ జోడించారు. తెలంగాణ కీలకమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో గేమ్ ఛేంజర్ గా మారిందన్నారు.
Read Also: ఛార్జీల పెంపు లేకుండా ఏసీ జర్నీ, రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్!