దేశంలో పవిత్ర ప్రధాన నదిగా గంగానది ప్రసిద్ధి. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లా కహల్గావ్ ప్రాంతంలో గంగా నది మధ్యలో ఉన్న అందమైన ద్వీపం మరోసారి పర్యాటకులకు తెరుచుకుంది. ప్రకృతి ప్రేమికులు, ఆధ్యాత్మిక యాత్రికులు, సాహస యాత్రలను ఇష్టపడే వారికి ఇది అద్భుతమైన డెస్టినేషన్ మారుతోంది. వేసవికాలంలో ఈ ద్వీపం విదేశీ పర్యాటక ప్రాంతాలను తలపించేలా ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, గంగా నది అందాలు ప్రతి సందర్శకుడిని ఆకట్టుకుంటాయి.
పర్యాటకుల భద్రత కోసం అధికారులు కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేశారు. లైసెన్స్ పొందిన పడవల ద్వారానే ద్వీపానికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. గంగా నదిలో ఈ పరిసరి ప్రాంతాల్లో దిగడం లేదా ఈత కొట్టడం పూర్తిగా నిషేధించారు. అలాగే ప్లాస్టిక్ సంచులు, పాలిథిన్ వస్తువులను తీసుకురావడానికి అనుమతి లేదు. ఈ నిబంధనలు.. పర్యాటకుల భద్రతతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం అమలు చేస్తున్నారు.
ఈ ద్వీపంలో గంగా నది చుట్టూ మూడు అందమైన కొండలు ఉన్నాయి. వాటిని శాంతి బాబా కొండ, బెంగాలీ బాబా కొండ, పంజాబీ బాబా కొండ అని పిలుస్తారు. ప్రతి కొండపై ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక స్థలం (ఆశ్రమం) ఉంది. శాంతి బాబా కొండపై బుద్ధ ఆశ్రమం ఉంది. బెంగాలీ బాబా కొండపై తపస్ ఆశ్రమం ఉంది. పంజాబీ బాబా కొండపై నానక్షాహీ ఆశ్రమం ఉంది. ఈ పవిత్ర ప్రాంతాలను సందర్శించేందుకు ప్రతి సంవత్సరం భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఈ కొండలను రాక్ కట్ టెంపుల్స్గా అభివృద్ధి చేసి సంరక్షించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే బీహార్లోని తక్కువగా తెలిసిన పర్యాటక ప్రాంతాలకు కూడా మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ద్వీపానికి చేరుకోవడానికి పడవ మాత్రమే మార్గం. అయితే భవిష్యత్తులో పర్యాటకులకు సులభంగా చేరుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. గంగా నదిపై రోప్వే నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. అలాగే లక్ష్మణ్ ఝూలా(ఊయల)ను స్ఫూర్తిగా తీసుకుని ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇవి పూర్తయితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
Also Read: మేఘాలు నేలను తాకే అందమైన ప్రదేశాలు.. వర్షాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
గంగనదిలో కహల్గావ్ ద్వీపం ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, సాహస యాత్రలను ఒకే చోట అందిస్తుంది. గంగా నది ఒడ్డున కనిపించే ప్రశాంత దృశ్యాలు, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. నగర జీవితంలోని రద్దీకి దూరంగా ప్రశాంత సమయాన్ని గడపాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశం.
కహల్గావ్ గంగా ద్వీపం బీహార్లో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాలు, పవిత్ర ఆశ్రమాలు, భవిష్యత్తులో రానున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణ తీసుకురానున్నాయి. పర్యాటకులు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఈ అందమైన ప్రాంతాన్ని సందర్శిస్తే మరపురాని అనుభూతిని పొందవచ్చు.