IRCTC Food: రైలు ప్రయాణంలో చాలా మంది ఫుడ్ కోసం ఇప్పటి వరకు ఎక్కువగా IRCTC క్యాటరింగ్ సేవలపైనే ప్రయాణికులు ఆధారపడేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే క్యాటరింగ్ సర్వీసులు వద్దనుకుంటున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సుమారు 25 నుంచి 30 శాతం మంది ప్రయాణికులు క్యాటరింగ్ ఆప్షన్ను ఎంచుకోవడం లేదని IRCTC వెల్లడించింది.
గతంలో రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు భోజనాన్ని తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు మాత్రం కొందరు క్యాటరింగ్ ఛార్జీలను ఆదా చేసుకోవడానికి ఆప్ట్ అవుట్ చేస్తున్నారని IRCTC భావిస్తోంది. ప్రయాణికులు క్యాటరింగ్ సేవలను వద్దనుకోవడం అంటే అందరికీ రైలు భోజనం నచ్చడం లేదని అర్థం కాదని IRCTC తెలిపింది. ప్రయాణికులకు ఇప్పుడు ఆహారం విషయంలో గతంతో పోలిస్తే ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. బయటి ఆహారాన్ని తీసుకెళ్లడం, ఇతర మార్గాల్లో భోజనం తీసుకోవడం, ప్రయాణ సమయంలో అవసరం లేకపోతే ఆహారాన్ని బుక్ చేయకపోవడం లాంటి కారణాలతో క్యాటరింగ్ సేవలను వదులుకుంటున్నవారు ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు.
IRCTC క్యాటరింగ్ సర్వీస్ చాలా పెద్దది. సంస్థ ఏడాదికి సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోంది. అంటే రోజుకు దాదాపు 18 లక్షల భోజనాలు ప్రయాణికులకు సరఫరా అవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ రోజుకు సుమారు 300 నుంచి 500 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని సంస్థ తెలిపింది. అయితే, ప్రయాణికుల నుంచి వచ్చే అన్ని ఫిర్యాదులు ఆహారం నాణ్యతకు సంబంధించినవి కావని IRCTC చెబుతోంది. అదనపు నీరు, చిన్న పిల్లల కోసం ఆహారం అడగడం, సిబ్బంది ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. రోజువారీగా అందించే భోజనాల సంఖ్యతో పోలిస్తే ఫిర్యాదుల శాతం చాలా తక్కువగా ఉందని IRCTC తెలిపింది.
ప్రయాణికులకు మరిన్ని ఫుడ్ ఆప్షన్స్ అందించేందుకు IRCTC తన ఇ-క్యాటరింగ్ సేవలను కూడా విస్తరిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా ప్రస్తుతం రోజుకు 1.25 లక్షల నుంచి 1.6 లక్షలకు పైగా భోజనాలు అందుతున్నాయని సంస్థ తెలిపింది. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ముందుగానే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉండటంతో ఈ సర్వీస్ కు ఆదరణ పెరుగుతోంది.
ఇ-ప్యాంట్రీ సేవ ప్రస్తుతం 50కి పైగా రైళ్లలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో దీన్ని సుమారు 100 రైళ్లకు విస్తరించాలని IRCTC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విధానంలో ప్రయాణికులు మొబైల్ యాప్ లేదంటే QR కోడ్ ద్వారా రైలులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కొందరు క్యాటరింగ్ ఛార్జీలను ఆదా చేసుకుంటుండగా, మరోవైపు ఇ క్యాటరింగ్, ఇ ప్యాంట్రీ లాంటి ప్రత్యామ్నాయ సేవలకు డిమాండ్ పెరుగుతోంది.
Read Also: 2026లోనూ రైల్వే లైన్ లేని దక్షిణ భారత జిల్లాలు ఇవే.. కారణం తెలిస్తే షాక్!