50 Vande Bharat Sleeper Trains: భారతీయ రైల్వేలోకి ఒకేసారి పెద్ద మొత్తంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. సుదూర, రాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు వేగంగా, సౌకర్యంగా ప్రయాణించే అవకాశం కల్పించేందుకు రైల్వే కొత్త రైలు సెట్ల తయారీపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 50 వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను తయారు చేయబోతోంది.
కొత్తగా తయారు చేయనున్న ప్రతి వందే భారత్ స్లీపర్ రైలులో 24 కోచ్లు ఉండనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 16 కోచ్ల స్లీపర్ రైలుతో పోలిస్తే పెద్ద రైలు సెట్. 24 కోచ్ల కారణంగా ఒక్కో రైలులో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. 16 కోచ్ల రైలుతో పోలిస్తే కొత్త రైలు సుమారు 1.5 రెట్లు ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లనుంది. దీంతో రద్దీగా ఉండే సుదూర మార్గాల్లో ప్రయాణికులకు మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
కొత్త 24 కోచ్ల వందే భారత్ స్లీపర్ రైలు సెట్లకు సంబంధించిన డ్రాయింగ్లు సిద్ధమయ్యాయని ICF జనరల్ మేనేజర్ మనీష్ అగర్వాల్ వెల్లడించారు. కోచ్ల నిర్మాణం, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించే వ్యవస్థలు, రైలు కింద అమర్చే పరికరాలకు సంబంధించిన డిజైన్లు ఇందులో ఉన్నాయి. స్వదేశీ సాంకేతికతతో ఈ రైలు సెట్లను తయారు చేయనున్నారు.
ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ సేవ హౌరా-కామాఖ్య మార్గంలో నడుస్తోంది. ఈ రైలులో 11 థర్డ్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. కొత్తగా 50 రైలు సెట్లు అందుబాటులోకి వస్తే మరిన్ని సుదూర మార్గాల్లో వందే భారత్ స్లీపర్ సేవలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే, ఏ మార్గాల్లో ఈ రైళ్లను నడపాలనే విషయంపై తుది నిర్ణయం ఇంకా వెల్లడించలేదు.
కొత్త 24 కోచ్ల రైళ్లలో ఏ తరగతికి ఎన్ని కోచ్లు ఉంటాయనే విషయాన్ని రైల్వే అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజా నివేదికల ప్రకారం 17 ఏసీ 3-టైర్, 5 ఏసీ 2-టైర్, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, ఒక ప్యాంట్రీ కోచ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 3.0పై కూడా ICF పని చేస్తోంది. కొత్త తరం అమృత్ భారత్ రైళ్లలో ఏసీ, జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అమృత్ భారత్ రైళ్లలో ప్రధానంగా జనరల్, స్లీపర్ కోచ్లు ఉన్నాయి. కొత్త వెర్షన్లో ఏసీ కోచ్లు చేరితే మరింత విస్తృతమైన ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 50 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ పూర్తయితే భారత రైల్వే సుదూర ప్రయాణ సేవల్లో మరింత ముందడుగు పడనుంది.
Read Also: రోజు రోజుకు తగ్గుతున్న రైల్వే ఫుడ్ బుకింగ్స్.. కారణం ఏంటంటే?