Railway Travel insurance: ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రయాణీకులకు తక్కువ ధరలో ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు పార్లమెంట్ కు తెలిపారు. ఇ-టికెట్లతో రైలు టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులు కేవలం 45 పైసల ప్రీమియంతో ప్రయాణ బీమా సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. రైల్వే బీమా సదుపాయానికి సంబంధించి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రయాణికులు ఆన్ లైన్, రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర తీసుకునే టికెట్ లో ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ఎంచుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న కన్ఫర్మ్ డ్, RAC ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందాలనుకునే వారు టికెట్ బుకింగ్ సమయంలో ఆప్షన్ ను స్వయంగా ఎంచుకునే అవకాశం ఉందన్నారు.
ప్రయాణీకులు నేరుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు!
ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకునే వారికి అదనపు బీమా కవరేజ్ లభిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టికెట్ ఛార్జీతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంగా 45 పైసలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా పొందే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులకు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీకి బీమా పాలసీ వివరాలు పంపంపబడుతాయన్నారు. పాలసీకి సంబంధించిన నామినీ వివరాలు నమోదు చేసుకునే లింక్ కూడా మెసేజ్ వస్తుందన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ జారీ, క్లెయిమ్ సెటిల్ మెంట్ కు సంబంధించి బీమా సంస్థే పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. ప్రయాణికులు, బీమా సంస్థ మధ్యే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు ఇన్సూరెన్స్ ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే వివరాలు సదరు బీమా సంస్థ పంపిన మెయిల్ లో వివరంగా రాసి ఉంటుందన్నారు. ప్రయాణికులు నేరుగా సంస్థతోనే క్లెయిమ్ సబ్ మిట్ చేసి పొందే అవకాశం ఉందన్నారు.
5 ఏళ్లలో రూ. 27 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్
ఇక ట్రావెల్ ఇన్సూరెన్స్ కు సంబంధించి గత 5 ఏళ్లలో 333 కెయిమ్స్ చేసినట్లు మంత్రి వైష్ణవ్ వివరించారు. సుమారు రూ.27.22 కోట్లను ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించాయన్నారు. ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయాణీకులకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు ఆయన వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించడమే ఈ పాలసీ లక్ష్యం అన్నారు. రైల్వే ప్రయాణీకులందరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం అందుబాటులో ఉంటుందన్నారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదంటే యాప్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్ ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఆప్షన్ డిఫాల్ట్ గా వస్తోందన్నారు. ఇన్సూరెన్స్ అవసరం లేదనుకునే వారు ఆ టిక్ తీసేసుకోవచ్చన్నారు. ప్రయాణీకులు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వారి కుటుంబానికి ఎంతో మేలు కలిగే అవకాశం ఉందన్నారు.
Read Also: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!